ఉక్రెయిన్లోని బుచాలో జరిగిన పౌర హత్యలను భారతదేశం ఖండించింది. అంతేకాకుండా ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మంగళవారం కీలక ప్రకటన చేశారు. బుచాలో ఇటీవలి పౌర హత్యల నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తాము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హింసను తక్షణమే నిలిపివేయాలని, శత్రుత్వాన్ని ఇరు దేశాలు విడనాడాలని సూచించారు. రష్యా ఆక్రమిత పట్టణమైన బుచాలోని రోడ్లపై ఎక్కడ చూసిన పౌరుల మృతదేహాలు కనిపించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రష్యా యుద్ధ నేరాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్లో విచారణ చేపట్టాలని అమెరికా పిలుపునిచ్చింది.