చింతామణి నాటకంపై నిషేధం సరికాదని, అయతే అసభ్యతకు తావులేని నాటకాలు కళాకారుల బాధ్యత అని తానా ప్రపంచ సాహిత్య వేదిక అభిప్రాయపడింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘పద్యనాటక సాహితీ వైభవం - రంగస్థల కళాకారుల గానమాధుర్యం’ చాలా రసవత్తరంగా సాగింది.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సదస్సును ప్రారంభిస్తూ.. మన తెలుగు భాష, సాహిత్యం, కళలను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడానికి దశాబ్ధాల చరిత్ర కలిగిన తానా సంస్థ ఎల్లప్పుడూ కంకణబద్ధమై ఉందని తెలిపారు. ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన ఈ వేడుకలో పాల్గొంటున్న కళాకారులందరుకూ హార్దిక స్వాగతం పలికారు.
‘‘ఒకప్పుడు ఎంతో వైభవంగా విరాజిల్లిన మన రంగస్థల వేదికలు మసకబారుతున్న వేళ తానా ప్రపంచ సాహిత్య వేదిక సారథ్యంలో అంతర్జాతీయ అంతర్జాల సమావేశం జరుపుకోవడం ముదావహం.. ఇది కళాకారులకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తుంది’ అని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల క్రితమే ఆనాటి సామాజిక రుగ్మతలను, దురాచారాలను ఎండగడుతూ సామాజిక శ్రేయస్సును కాంక్షించి విలువైన సాహిత్యాన్ని సృష్టించిన రచయితలను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది అన్నారు.
అలాంటి రచయితలలో ముందు వరసలో ఉండే ‘చింతామణి’ లాంటి అనేక నాటకాలు రాసిన ప్రముఖ నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు; ‘శ్రీకృష్ణ తులాభారం’ పద్యనాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు; ‘పాండవోద్యోగ విజయాలు’ లాంటి వందలాది సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకాలు రచించిన అవధాన జంట కవులు తిరుపతి వేంకట కవులు;
‘సత్యహరిశ్చంద్ర’ నాటక రచయిత, ఎన్నో సినిమాలకు కథ, మాటలు, పాటలు రాయడమేగాక పలు సినిమాలలో నటించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి; ‘గయోపాఖ్యానం’ లాంటి గొప్ప నాటకాన్ని రచించిన కవి, నాటకకర్త, సంఘసంస్కర్త, పాత్రికేయుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గార్ల జీవనయానం ఎంతో స్పూర్తిదాయకం అన్నారు. ప్రతి కళాకారుడు ఆయా నాటక ప్రదర్శనల ముందు ఆయా రచయితలను గుర్తు చేసుకుని నాటకాన్ని ప్రారంభించే సంప్రదాయం నెలకొల్పడం అవసరమని అదే ఆ రచయితలకర్పించే ఘన నివాళి అని పేర్కొన్నారు.
గౌరవ అతిథిగా హాజరైన ఎన్టీఆర్ పురస్కార గ్రహీత గరికపాటి సుబ్బ నరసింహ శాస్త్రి.. మాధవపెద్ది వెంకట్రామయ్య, బందా కనకలింగేశ్వర రావు, అద్దంకి శ్రీరామమూర్తి, పీసపాటి నరసింహ శాస్త్రి లాంటి విశిష్ఠ రంగస్థల కళాకారుల సరసన నటించగల్గడం తన అదృష్టం అంటూ తన 88 ఏళ్ల వయస్సులో కూడా పదును తగ్గని వాచకం, ఉత్సాహంతో పలు పౌరాణిక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని గావించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ఠ రంగస్థల కళాకారులు పాల్గొని కొన్ని నాటకాలలోని పద్యాలను మధురంగా ఆలపించి వీనులవిందు చేశారు. పద్మశ్రీ యడ్ల గోపాలరావు (శ్రీకాకుళం) ‘హరిశ్చంద్ర – నక్షత్రకుడు’; గుమ్మడి గోపాలకృష్ణ (హైదరాబాద్) ‘శ్రీకృష్ణ రాయబారం’ – ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’; జూనియర్ దుబ్బు వెంకట సుబ్బారావు (వేటపాలెం) ‘హరిశ్చంద్ర – కాటిసీను’; చిలువేరు శాంతయ్య (మధిర) ‘చింతామణి – భవానీ శంకరుడు’;
గుంటి రత్నశ్రీ (కడప) ‘చింతామణి – చింతామణి’; షణ్ముఖి జయవిజయకుమార్ రాజు (తణుకు) ‘శ్రీకృష్ణ తులాభారం – నారదుడు’; బడే శ్రీరాములు నాయుడు (పార్వతీపురం) ‘గయోపాఖ్యానం – అర్జునుడు’; కొప్పర మంగాదేవి (పార్వతీపురం) ‘హరిశ్చంద్ర – వారణాసి’; పలగాని ఫణి శంకర్ గౌడ్ (విజయవాడ) ‘చింతామణి – బిల్వమంగళుడు’; తెలుగు కృష్ణ (మహబూబ్ నగర్) ‘శ్రీకృష్ణ రాయబారం– పడకసీను’; కోట వనజ కుమారి (అనంతపురం) ‘శ్రీ కృష్ణ తులాభారం – సత్యభామ’; ఆరాథ్యుల నాగరాజు (తెనాలి) ‘గయోపాఖ్యానం – శ్రీకృష్ణుడు’; నిమ్మగడ్డ సుగ్రీవుడు (నెల్లూరు) ‘శ్రీరామాంజనేయ యుద్ధం- శ్రీ రాముడు’ పాత్రలతో అలరించారు.
డాక్టర్ తోటకూర ప్రసాద్ సమాపనా సందేశంలో పాల్గొన్న కళాకారులకు, కార్యక్రమాలను సదా ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించడం సబబుగాదని, దానివల్ల ఎంతోమంది కళాకారులు తమ జీవన భృతిని కోల్పోతున్నారని తెలిపారు. నిషేధంపై ప్రభుత్వం పునరాలోచించాలని అలాగే అసభ్యతకు తావు లేని, కలుషితంగాని ప్రదర్శనలు ఇవ్వాల్సిన భాద్యత కళాకారులపై ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa