అగ్రదేశం అమెరికాలో తెలుగు వారికి అరుదైన గుర్తింపు దక్కింది. శ్రీశుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించారు. ఈ మేరకు ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూరకు గవర్నర్ అబ్బాట్ అధికారిక ప్రకటన ప్రతిని అందజేశారు.
“టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ.. విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాల్లో పోషిస్తున్న పాత్ర మరువలేనిది. తెలుగు వారికి ఉన్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తి పట్ల నిబద్ధత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తెలుగు వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి’’ అని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలంగా నివసిస్తున్న తెలుగు వారి పట్ల గవర్నర్ ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. గవర్నర్ అబ్బాట్ తన శ్రీమతి సిసీలియాతో కలసి తెలుగు వారి నూతన సంవత్సరమైన ఉగాదిని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందులకు టెక్సాస్ రాష్ట్ర తెలుగు ప్రజలందరి తరఫున గవర్నర్ దంపతులకు ప్రసాద్ తోటకూర హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa