నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఒక నిమ్మకాయ ధర రూ.15-20 మధ్య పలుకుతోంది. నెల రోజుల క్రితం రూ.70 నుంచి రూ.80లకు లభించిన కిలో నిమ్మకాయ కోసం ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 పెట్టాల్సి వస్తోంది. నిమ్మకాయల ధరలు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ ఏపీలోని ఏలూరులో ఉంది. ఏలూరు నుంచే దేశవ్యాప్తంగా 40-45 శాతం అవసరాలకు నిమ్మకాయలు రవాణా అవుతాయి. ఏలూరు మండిలో 20 వేల మందికి పైగా నిమ్మకాయల రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఏలూరు నుంచి సాధారణంగా ప్రతిరోజూ 25 ట్రక్కుల నిమ్మకాయలు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తాయి. ఒక ట్రక్కులో 21 టన్నుల నిమ్మకాయలు ఉంటాయి. కానీ ఇప్పుడు కష్టంగా ఏలూరు నుంచి కేవలం 5 ట్రక్కుల నిమ్మకాయలు మాత్రమే రవాణా అవుతున్నాయి. సాధారణ సీజన్తో పోలిస్తే 5 రెట్లు తక్కువ.
ఒక టన్ను నిమ్మకాయల ధర రూ.5 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగింది. రెండేండ్లుగా రైతులు భారీగా నష్టపోయారు. దీనికి కారణం కరోనానే. కరోనాను నిరోధించేందుకు నిమ్మకాయలు విరివిగా వాడినా దాని కట్టడికి 2020లో విధించిన లాక్డౌన్ వల్ల మార్కెట్లు తెరుచుకోలేదు. ఫలితంగా ఏలూరులో నిమ్మసాగు చేసిన రైతులు నష్టపోయారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో నిమ్మకాయల దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా ప్రజల నిత్యావసరాల్లో ఒకటైన నిమ్మకాయ కొరత ఏర్పడింది. దీంతో రూ.5 లక్షలు పలికిన టన్ను నిమ్మకాయలు ఇప్పుడు రూ.31 లక్షలకు పెరిగాయి.
గుజరాత్ లోని జమల్పూర్ కలూపూర్ మార్కెట్లలో కిలో నిమ్మకాయలు రూ.140-160 పలుకుతున్నాయి. గతేడాది తుపాన్ల వల్ల సౌరాష్ట్రలో నిమ్మతోటలు దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. రైతులకు ఆదాయం తగ్గడంతోనే నిమ్మకాయల ధరలు పెరిగాయంటున్నారు. సౌత్ గుజరాత్ లో కిలో నిమ్మకాయల ధర రూ.200 గా ఉండగా, రిటైల్ దుకాణాల్లో రూ.300 పలుకుతోంది. అహ్మదాబాద్లో రూ.140-160, మార్కెట్ బయట రూ.180-200లకు హోల్సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. చిన్న దుకాణాల వ్యాపారులు రూ.200-250కి కొనుగోలు చేస్తే సామాన్యుడి దగ్గరికి వచ్చే సరికి రూ.300-400లకు చేరుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa