విజయనగరం జిల్లా బిరసాడవలస సమీపంలో సోమవారం రాత్రి చిరుతపులి సంచరించినట్లు తెలిసి మెంటాడ మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. చింతలవలస, జయతి కొండ ప్రాంతం నుంచి పులి వచ్చి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈమేరకు సోమవారం రాత్రంతా వివిధ పరికరాలతో గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ ఆచూకీ కోసం గాలించారు. అటవీ అధికారులు మంగళవారం ఆ ప్రాంతంలో పరిశీలించి.. చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయని తేల్చిచెప్పారు. మెంటాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బిరసాడలవలస వద్ద కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. కోళ్లఫారానికి అతి సమీపంలో చిరుతపులి రోడ్డుకు ఎదురుగా కనిపించిందని.. వాహనం శబ్దానికి మామిడితోటలోకి దూకి అనంతసాగరం చెరువు వైపు వెళ్లిందని చింతలవలస గ్రామస్థులకు చెప్పి వెళ్లిపోయాడు.
గ్రామంలోకి పులి చొరబడుతుందనే భయంతో గ్రామస్థులు రాత్రంతా వివిధ పరికరాలతో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ గడిపారు. అడుగులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కేవీఎన్ రాజు తమ బృందంతో ఆ ప్రాంతంలో మంగళవారం పరిశీలించారు. చిరుత అడుగుజాడలు, వెంట్రుకలను సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాము గుర్తించిన అడుగుల పోలికలు, వెంట్రుకలు చిరుతపులివేనని చెప్పారు. ఒడిశా సమీప అడవుల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాయపూర్ నుంచి కొత్తవలస వరకు గ్రీన్ఫీల్డ్ హైవే పనులు జరుగుతుండడం, కొండలను తవ్వడం, యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టడం వల్ల ఆ శబ్దాలకు భయపడి ఇటుగా వచ్చి ఉండొచ్చునని చెప్పారు.
అనంతసాగరం సమీపంలోని కోళ్లఫారం వద్ద తోట కంచెకు చిరుత తగలడంతో వెంట్రుకలు రాలాయని అభిప్రాయపడ్డారు. సమీప గ్రామాల్లో దండోరాలు వేయిస్తున్నామని తెలిపారు. చిరుత సంచరించిన ఆనవాళ్లు స్పష్టంగా తెలియజేస్తే పట్టుకుంటామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ డి.రవి కోరారు. రాత్రి వేళల్లో బయటకు రావద్దన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa