సమ్మర్ వచ్చిందంటే చాలు ఉక్కపోత మొదలవుతోంది. దీంతో చాలా మంది ఇన్ని రోజులుగా మూలకు పెట్టిన ఎయిర్ కూలర్లను బయటకు తీస్తారు. అయితే పాత కూలర్లతో ఎక్కువ గాలి, చల్లదనం రావాలంటే కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గదిలో తలుపులు, కిటికీలు మూసేస్తే కూలర్, ఏసీ గాలి బయటకు పోదు. దీనివల్ల గది మొత్తం చల్లగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. గాలి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోతే తేమ మొత్తం గదిలో నిండిపోతుంది. దీనివల్ల శరీరం జిడ్డుగా మారి చికాకు పెడుతుంది. అందుకే తేమ బయటకు వెళ్లాలంటే కూలర్లను కిటికీ ముందు పెట్టడం మంచిది. ఒకవేళ కిటికీ పెద్దగా ఉంటే కిటికీని కొంచెం మూసేయొచ్చు.
కూలర్లలో నుంచి గాలి మరింత చల్లగా రావాలంటే కూలర్ ట్యాంక్ లో చల్లటి నీళ్లు పోయాలి. లేదా నీటిలో ఐస్ వేయాలి. కొన్ని కూలర్లలో ఐస్ వేసేందుకు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు కూడా ఉంటుంది. ఇలా చేస్తే సాధారణం కంటే కొద్దిగా చల్లటి గాలి వస్తుంది. అంతేతప్ప గది మొత్తం చల్లబడదు. అలాగే చల్లటి గాలి వస్తుంది కదా అని ఎక్కువగా ఐస్ వేయొద్దు. అలా ఎక్కువ ఐస్ వేయడం వల్ల కూలర్ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు మాత్రమే ఐస్ ను ఉపయోగించాలి.
చాలా మంది ఎండాకాలం అయిపోగానే ఎయిర్ కూలర్లను పక్కన పెట్టేస్తారు. మళ్లీ సమ్మర్ రాగానే వాటిని బయటకు తీసి వాడుతుంటారు. సీజన్ లో తొలిసారి కూలర్ ను బయటకు తీసినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యాడ్స్ ను శుభ్రం చేసుకోవాలి. ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ బ్లేడ్స్ ను కూడా శుభ్రంగా కడగాలి.
ఎయిర్ కూలర్ లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్ ను ఆన్ చేయాలి. అప్పుడు పంప్ రన్ అవ్వగానే కూలింగ్ ప్యాడ్లు నీటితో తడుస్తాయి. దీంతో మనం కూలర్ ఆన్ చేసేలోపు కూలింగ్ ప్యాడ్స్ తడిసిపోయి ఉంటాయి. దీంతో కూలర్ ఆన్ చేయగానే చల్లటి గాలి వస్తుంది. వీటితో పాటు గదిలోకి ఎండ రాకుండా కర్టెన్లు వేయడం, గదిలో తక్కువ సామన్లు ఉండేలా చూసుకోవడం ద్వారా కూడా గది త్వరగా చల్లబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa