ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రికల్ వైపు ఏపీఎస్ ఆర్టీసీ..ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్ ల పంపిణీకి నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 11:07 PM

ఏపీఎస్ ఆర్టీసీ తన ఉద్యోగుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తంగా ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైక్‌లను అందించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, బస్‌స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.


సంప్రదాయ ఇంధన వనరుల సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి బస్‌స్టేషన్లలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సోలార్ విద్యుత్‌ను అందిస్తామని, ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు నాణ్యమైన బ్యాటరీ కలిగి నాలుగేళ్ల వారంటీతో కూడిన వాహనాలు అందించేందుకు నెడ్‌క్యాప్ ముందుకొచ్చింది. అది గుర్తించిన సంస్థలు ఈ వాహనాలను అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర లక్ష రూపాయలకు పైగా ఉంటుంది. అయితే, ఇందుకోసం ఎలాంటి ముందస్తు రుసుముచెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి నెల ఈఎంఐ ఒక్కటీ చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం రూ. 2 వేలు, రూ. 2,500గా రెండు వేర్వేరు ఆప్షన్లు ఉన్నాయి. 


ఉద్యోగులు తమకు అనుగుణంగా ఉన్న దానిని ఎంచుకోవచ్చు. అలాగే, 24 నుంచి 60 నెలల వరకు చెల్లించుకునే అవకాశం ఉంది. ఎంపిక చేసుకునే వాహనాన్ని బట్టి దాని వేగం ఆధారపడి ఉంటుంది. కనీసం 40 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దేశంలోని టాప్ కంపెనీలతోపాటు ఈవీ రంగంలో అనుభవం ఉన్న సంస్థతో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులకు వాహనాలు అందిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa