బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. ఆ జిల్లాలో ఓ మహిళా తన గదిలో ఆత్మహత్య చేసుకొంది. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పనిచేసే ఆమె బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్ బ్యాంక్ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ. 40 లక్షల రుణం తీసుకున్నారు. తీసుకున్న డబ్బుతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకుని ఉప్పాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు. బ్యాంకులో పని ఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవలే ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఆమెను సముదాయించి పంపించారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించారు. అయితే, ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న శ్రీనివాసరావు గది వైపునకు రాగా, రూమ్లో సీలింగ్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
తల్లిదండ్రులు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన యువతి స్థానికంగా తన సొంత భవనంలో బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa