ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై వర్క్ ఫ్రం...హోం చెల్లదు: ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:30 AM

ఇకపై వర్క్ ఫ్రం హోం ఏ మాత్రం చెల్లదని, ఉద్యోగంలో ఉండాలంటే ఆఫీసుకొచ్చి పనిచేయాల్సిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. గత రెండు నెలల నుంచి టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తన వ్యవహార శైలితో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు చివరి హెచ్చరికలు జారీచేసి వార్తల్లో నిలవడం గమనార్హం. ఇంటి నుంచి పనిచేయడం కుదరదని కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని ఉద్యోగులకు తేల్చిచెప్పారు. ఆఫీసుకు రావడం ఇష్టం లేకపోతే టెస్లాను వీడిపోవచ్చంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు సంబంధించి ఉద్యోగులకు మస్క్‌ పంపిన మెయిల్‌ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది.


‘దీర్ఘకాలం ఇంటి నుంచి పనిచేయడం ఆమోదయోగ్యం’ కాదంటూ మెయిల్ పెట్టిన ఎలాన్ మస్క్.. రిమోట్ వర్క్ చేయాలని భావించేవారు వారానికి కనీసం 40 గంటలు ఆఫీసులో ఉండాలని స్పష్టం చేశారు. ‘ఇతర ప్రాంతం నుంచి పనిచేయడం ఇక నుంచి ఆమోదయోగ్యం కాదు.. ఎవరైనా ఇంటి నుంచి పనిచేయాలని అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు ఆఫీసులో ఉండాల్సిందే.. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవచ్చు.. ఫ్యాక్టరీ కార్మికులకు చెప్పిన దానికంటే ఇది చాలా తక్కువ’ అంటూ మస్క్ నుంచి ఉద్యోగులకు ఇటీవల మెయిల్ వచ్చింది.


‘‘ఆఫీస్‌ అంటే టెస్లా ప్రధాన కార్యాలయం మాత్రమే... విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదు.. ఉదాహరణకు ఫ్రీమాంట్ ఫ్యాక్టరీలో మానవ సంబంధాలకు బాధ్యత వహించాలి.. కానీ మీ కార్యాలయం వేరే రాష్ట్రంలో ఉంది’’ అని తన మెయిల్‌లో మస్క్ స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులకు పంపిన మెయిల్‌ లీకయి ఉండవచ్చని ట్విట్టర్ అనుమానం వ్యక్తం చేసిన ఓ వ్యక్తి.. ఆఫీస్‌కు వెళ్లి పనిచేయడం అనేది పాత పద్ధతి అంటూ కొందరు భావిస్తున్నారు.. దీనిపై మీరేమైనా స్పందిస్తారా? అంటూ మస్క్‌ను ప్రశ్నించారు.


దీనికి బదులిచ్చిన మస్క్.. ఈ-మెయిల్‌ ప్రామాణికమైందా? లేదా? అనే విషయాన్ని దాటవేశారు. అటువంటి వారు వేరేచోట్ల పనిచేస్తున్నట్లు అనుకోవాలంటూ జవాబిచ్చారు. కాగా, సంస్థలోని ఉద్యోగుల పట్ల ఎలాన్‌ మస్క్‌ కఠినంగానే వ్యవహరిస్తారని అనేక కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఈ విషయమై గతంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ఆయనతో పనిచేసిన వారు గుర్తుచేసుకుంటున్నారు.


మరోవైపు షాంఘైలో లాక్‌డౌన్‌ కారణంగా అక్కడున్న టెస్లా కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కార్మికులతో వారానికి ఆరు రోజులపాటు రోజూ 12 గంటలు పని చేయిస్తున్నారని తెలుస్తోంది. కోవిడ్‌ వ్యాప్తితో క్లోజ్‌డ్‌ లూప్‌ మానిఫాక్చరింగ్‌ సిస్టమ్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న టెస్లా సిబ్బంది.. అలసిపోయి నేలపైనే పడుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది.


అయితే, ఉద్యోగుల పట్ల మస్క్ కఠినంగా వ్యవహరించడ ఇదే తొలిసారి కాదు.


ట్విట్టర్‌ కొనుగోలు ప్రయత్నంలో మస్క్ విజయం సాధించడానికి దాదాపు రెండు వారాల ముందు.. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్, వ్యవస్థాపకుడు కీత్ రాబోయిస్ ఆయన గురించి ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. ఒకసారి స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్‌లో కాఫీ కోసం వేచి ఉన్న సమయంలో ఇంటర్న్‌ల గుంపును గమనించిన మస్క్.. దీనిని అవమానంగా భావించాడు. తీవ్రంగా స్పందించిన ఆయన ఇటువంటింది మళ్లీ జరిగితే ఇంటర్న్‌లందరినీ తొలగిస్తానని హెచ్చరించాడని కీత్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa