నేడు మన దేశంలో ఏ సేవకైనా, ఏ ప్రయోజిత కార్యక్రమానికైనా సరే ఆధార్ తప్పని సరిగా మారింది. ఆధార్ తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందటా. నకిలీల, అక్రమార్కుల బెడదను ఈ ఆధార్ చెక్ పెడుతోందాటా. ఇదిలావుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు ప్రోగ్రామ్ ‘ఆధార్’ అని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్తో నకిలీలను గుర్తించడం చాలా తేలికైందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లకుపైగా ఆదా అయ్యిందని పేర్కొన్నారు. అర్హులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చాలా వేగంగా పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. ఆధార్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈఓ పలు విషయాలను వెల్లడించారు.
‘315 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 500 రాష్ట్ర పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆధార్ను వినియోగించుకోవడం అభినందనీయం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ ఓ పునాదిలా మారింది.. మధ్యవర్తుల ప్రమేయం, ఎటువంటి అవంతరాలు లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనాలను నేరుగా వేగంగా అందించింది. దీంతో పాటు నకిలీలను గుర్తించడం వల్ల ప్రభుత్వానికి రూ.2.22 లక్షల కోట్ల ఆదా అయ్యింది’ అని అమితాబ్ కాంత్ వివరించారు. అంతేకాదు, ఇతర దేశాల్లోనూ ఈ విధానాన్ని అమలుచేసే అవకాశాలపై ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.
భారతీయ పౌరులకు 12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ జారీచేస్తోంది. వయసు, కులమత లింగ బేధం లేకుండా ప్రతి భారతీయుడికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేంద్రం అందజేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం మార్గదర్శకాలను ఇటీవల వెలువరించింది. ఆధార్ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్డ్ కార్డు జిరాక్స్ను మాత్రమే అందజేయాలని మార్గదర్శకాలలో సూచించింది. పలు సందర్భాల్లో ఆధార్ దుర్వినియోగం అవుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తాజా మార్గదర్శకాలను విడుదల చేసినట్టు తెలిపింది.
అయితే, దీనిపై విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. మాస్క్డ్ ఆధార్పై ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంది. ఆధార్ వినియోగంలో పౌరులు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, యూఐడీఏఐ వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా రూపొందించామని పేర్కొంది. బ్యాంకు ఖాతాలతో పాటు ఉద్యోగులు భవిష్య నిధి సహా పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa