ఏపీలో టెన్త్ ఫలితాలపై రాజకీయ దుమారం రేపుతోంది. టెన్త్ ఫలితాలకు కారణం ప్రభుత్వ విధానాలే కారణమని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలావుంటే సోమవారం విడుదలైన ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాల్లో 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 78.3 శాతంతో ప్రకాశం జిల్లా తొలి స్థానంలో నిలవగా.. 49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 50.10 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదు కాగా.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 91.10 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం.
స్థూలంగా చూస్తే.. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా పదిలో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. కరోనా కారణంగా రెండేళ్లు బోధన సరిగా సాగకపోవడం.. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం లోపించడం వల్ల ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి బొత్స తెలిపారు.
ఇదిలావుంటే టెన్త్లో ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు, ప్రభుత్వం అని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్ర జరిగిందని విపక్షం ఆరోపించింది. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో ప్రభుత్వం అభాసుపాలు అయ్యిందని లోకేశ్ ఆరోపించారు. ‘టెన్త్ రిజల్ట్స్ వాయిదా.. దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే. నాడు నేడు పేరుతో 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసారు’ అంటూ ప్రభుత్వంపై లోకేశ్ మండిపడ్డారు.
‘టీచర్లకి వైన్షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై పెట్టలేదు. ఒక్క డీఎస్సీ తీయకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. 71 స్కూళ్లలో జీరో పాస్.. 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వడం వైసిపి ప్రభుత్వం పాపమే’ అని లోకేశ్ ఆరోపించారు.
‘నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదు. టిడిపి హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత... ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనం’ అని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
‘రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదు అని అంతా గుర్తించాలి. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa