కేసీఆర్ తో భేటీలో రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగిందని, బీఆర్ఎస్ గురించి మాత్రం ప్రస్తావన రాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపైనే చర్చ జరిగిందన్నారు. దేశంలో మోదీ పాలనను వ్యతిరేకించే వారిలో కేసీఆరే బలమైన నేతగా ఉన్నారన్నారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని చెప్పిన ఉండవల్లి... ఆ పార్టీ విధానాలతో తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్నట్లుగా మరింత మేర పెరిగితే ప్రమాదమేనని ఉండవల్లి చెప్పారు. ఈ విషయంపైనే తాము ప్రధానంగా చర్చించుకున్నామన్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తే చేశారన్నారు. బీజేపీపై కేసీఆర్తో పాటు తనదీ ఒకటే అభిప్రాయమని ఆయన చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్తో ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఉండవల్లి సోమవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయనతో భేటీ అయ్యానని ఈ సందర్భంగా ఉండవల్లి చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ భేటీలో ఎలాంటి పార్టీ గురించి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను ప్రగతి భవన్కు వెళ్లానని చెప్పిన ఉండవల్లి...తనను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్తో తన భేటీలో హరీశ్తో పాటు మరో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నారని ఆయన చెప్పారు. తాము చర్చించుకున్నంత సేపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. అయితే ప్రశాంత్ కిశోర్ చర్చలో పాలుపంచుకోలేదని, తాము మాట్లాడుకుంటూ ఉంటే ఆయన సాంతంగా విన్నారని తెలిపారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బలమైన పార్టీ అని ఉండవల్లి చెప్పారు. ఏపీలోని 25 మంది ఎంపీలనూ బీజేపీ ఎంపీలుగానే భావించాలని ఆయన చమత్కరించారు.
ఇక కేసీఆర్తో కలిసి తాను మధ్యాహ్న భోజనం చేశానని ఉండవల్లి చెప్పారు. తనను కేసీఆర్ ఆహ్వానిస్తే... సీఎంఓ తాను వెజ్ తింటానా? నాన్ వెజ్ తింటానా?అంటూ ఆరా తీసిందని ఆయన చెప్పారు. తనతో పాటు కేసీఆర్ కూడా శాకాహారమే తిన్నారని చెప్పారు. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్లు మాంసాహారం తినేందుకు ఆసక్తి చూపుతారని, అయితే కేసీఆర్ ఏం తింటారో తనకు తెలియదని, తనతో కలిసి ఆయన వెజ్ మాత్రమే తిన్నారని ఆయన చెప్పారు. ప్రశాంత్ కిశోర్ కూడా తమతో కలిసి లంచ్ చేశారని ఆయన చెప్పారు. తాను అరగంట మాట్లాడితే కేసీఆర్ రెండున్నర గంటలపాటు మాట్లాడారని ఉండవల్లి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa