ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైన్ షాపు పై ఆవు పెడ విసిరిన ఉమా భారతీ

national |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 04:34 PM

ఓ వైన్ షాపు పై మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతీ ఆవుపేడ విసిరిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఉమా భారతి అన్నట్టుగా వీడియోలో ఉంది. ఇదిలావుంటే మద్యపానాన్ని నిషేధించాలని సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో ఆమె దాడిచేసి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరం ఓర్చాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం దుకాణం ఏర్పాటు చేసిన స్థలానికి అనుమతి లేదని, ఎంతో పవిత్రమైన ఓర్చా నగరంలో ఇలాంటి వ్యాపారం చేయడం నేరమంటూ ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఆమె పేడ విసిరిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఉమా భారతి అన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ ఏడాది మార్చిలోనూ భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో ఆమె దాడి చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అజాద్ నగర్ ప్రాంతంలోని మద్యం దుకాణానికి తన అనుచరులతో వెళ్లిన ఉమా భారతి.. రాళ్లతో దాడిచేసి వైన్ సీసాలను పగలగొట్టారు.


ఓర్చా ఘటన తర్వాత ఆమె మంగళవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఓర్చా నగరం ప్రధాన ద్వారం వద్ద వైన్ షాపు ఉంది.. అనుమతిలేని ప్రదేశంలో ఆ దుకాణం ఏర్పాటుచేశారు. దీనిపై ప్రజలు, మా సంస్థ సభ్యులు తరుచూ ఆందోళనలు తెలుపుతూ ఈ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు.. వినతి పత్రాలూ అందజేస్తున్నారు.. పవిత్రమైన నగరం నుదుటిన ఈ దుకాణం పెద్ద కళంకంగా ఉన్నందున దాన్ని మూసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ విషయంలో ప్రజల నుంచి వస్తోన్న స్పందనలను నేరంగా భావించలేం.... ఎందుకంటే అక్కడ ఈ దుకాణం తెరవడమే ఓ పెద్ద నేరం’’ అని ఉమాభారతి వ్యాఖ్యానించారు.


‘‘శ్రీరామ నవమి సందర్భంగా ఓర్చాలో నిర్వహించిన దీపోత్సవ్‌ రోజున ఐదు లక్షల దీపాలు వెలిగించిన సమయంలోనూ ఈ దుకాణం తెరిచి ఉందని నాకు సమాచారం వచ్చింది.. ఇది అయోధ్యలా పవిత్రమైనది.. అందుకే పవిత్రమైన గోశాలలోని ఆవుపేడను మద్యం షాపుపై విసిరికొట్టాను.. అయినా మా భావజాలానికి చెందిన సంస్థలు నిరసన తెలిపినప్పటికీ ఇంకా ఆ దుకాణం ఉంచడం సిగ్గుచేటు’’ మండిపడ్డారు.


అయితే, ఆ దుకాణం ప్రభుత్వం అనుమతించిన స్థలంలోనే ఉందని ఓర్చా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అభయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పేడతో దాడి చేసిన తర్వాత కాంట్రాక్టర్‌ ఈ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు. ఇక, భోపాల్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆధ్యాత్మిక నగరం ఓర్చాలో రామ్ రాజా ఆలయం చాలా ముఖ్యమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa