నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవ్వడమే దేశంలోని నిరసనల్లో విధ్వంసాలకు కారణమవుతోందని తేలింది. ఇదిలావుంటే కోవిడ్ సమస్య ప్రారంభమైన తర్వాత దేశంలో కొత్త ఉద్యోగాల సంగతే అందరూ మర్చిపోయారు. ఉన్న ఉద్యోగం కాపాడుకుంటే చాలనే పరిస్దితికి వచ్చేశారు. మరి నిరుద్యోగులు అలా ఉండలేకపోతున్నారు. వీరు కొన్నేళ్లుగా రైల్వే రిక్రూట్ మెంట్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరి వారిని ప్రభుత్వాలు కరుణించడం లేదు. కరోనా సమస్యలతో రైల్వే రిక్రూట్ మెంట్లు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్ధితి. దీంతో వీటినే నమ్ముకున్న యువతలో అసహనం పెరుగుతోంది. ఇది రైళ్లు తగులబెట్టే స్ధాయికి చేరిపోతోంది.
రైల్వే రిక్రూట్ మెంట్ కోసం రైల్వే బోర్డు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ లో 35281 ఉద్యోగాలు ఉంటే వాటి కోసం 1.25 కోట్ల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే భారత్ లో 2030 నాటికి 90 మిలియన్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. తాజాగా కేంద్రం ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల భర్తీకి 18 నెలలు తీసుకుంటోంది. ఇక 90 కోట్ల ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వానికి సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్ధితులే దేశంలోని యువతలో అసహనం పెంచుతున్నాయి. ఈ అసహనం కాస్తా రైళ్ల దహనం వంటి హింసాత్మక ఘటనలకు దారి తీసేలా చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనపై దృష్టిపెడితే ఇలాంటి హింసాత్మక పద్ధతుల నుంచి యువతను దారి మళ్లించే అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa