జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అప్పులతో ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంభాల్లో భరోసా నింపేలా సాగుతోంది. ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిలు సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర కొనసాగింది.
అలాగే, సాగు భారమై, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం యనమదల గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. వెంకటేశ్వర్లు భార్య పోలవరపు అనూషకు పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
తండ్రిని కోల్పోయిన ఇద్దరు ఆడబిడ్డలు వైష్ణవి, శ్రీలక్ష్మీ చదువుల బాధ్యతను జనసేన పార్టీ చూసుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. వరుసగా పంట నష్టాలు రావడం, బోర్లు వేసిన నీళ్లు పడకపోవడం, సాగు కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులను ఓదారస్తూ... మనోధైర్యం నింపడానికే మేమంతా ఇక్కడికి వచ్చామని, మీ కుటుంబానికి అండగా నిలబడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa