ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు: ఉద్దవ్ ఠాక్రే

national |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 11:53 PM

మహారాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే భావోద్వేగంగా స్పందిస్తూ నా అనుకొన్న వాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అవుతున్న వేళ.. సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ రెబల్ వర్గాన్ని బుజ్జగించేలా ఆఫర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటం ఒక్క ఎమ్మెల్యేకు ఇష్టం లేకపోయినా తాను తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్దవ్ ప్రకటించారు. ‘‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ తదుపరి సీఎం శివసేన నుంచే ఉంటారని మీరు స్పష్టం చేయగలరా..?’’ అని ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను థాక్రే సూటిగా ప్రశ్నించారు.


 బుధవారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన థాక్రే.. సొంత పార్టీ నేతలు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం బాధించిందన్నారు. నా అనుకున్న వాళ్లే తనను మోసం చేశారని ఆయన వాపోయారు. కోవిడ్ ప్రభావంతో తన గొంతు వణుకుతోందన్నారు. ‘‘రండి.. రాజీనామా చేయమని నా ముఖం మీదే చెప్పండి. నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాను. నేను కావాలనుకొని సీఎం కాలేదు.. అనుకోకుండా ఆ పదవి నన్ను వరించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరడంతోనే నేను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాను’’ అని థాక్రే తెలిపారు.


నా సొంత పార్టీ నేతలే నేను ముఖ్యమంత్రిగా ఉండొద్దంటే.. నేనేం చేయాలి.? అని ఉద్దవ్ వాపోయారు. నన్ను వాళ్లు తమవాడిగా చూడటం లేదు కాబట్టి.. వారిని తనవాళ్లు అని పిలవొచ్చో లేదోనంటూ.. శివసేన అధినేత భావోద్వేగానికి లోనయ్యారు. అవసరమైతే తక్షణమే సీఎం అధికార నివాసం ‘వర్ష’ను ఖాళీ చేసి తన సొంతిళ్లయిన ‘మాతోశ్రీ’కి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.


మరోవైపు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌తో కలిసి నలుగురు శివసేన ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం గువహటి బయల్దేరి వెళ్లారు. తాము కిడ్నాప్ అయ్యామంటూ ఏక్‌నాథ్ షిండేతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఉద్దవ్ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జతకట్టడాన్ని ఏక్‌నాథ్ షిండే వ్యతిరేకిస్తుండగా.. తమ పార్టీ ఎప్పటికీ హిందూత్వ అజెండాను వదిలిపెట్టబోదని థాక్రే స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే మీడియాతో మాట్లాడిన అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. సీఎంతో భేటీ అయ్యారు.


ఇదిలావుంటే ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలనలో ఉన్న అసోం రాజధాని గువహటిలోని ఓ హోటల్‌లో ఉన్నారు. షిండేను తమ నాయకుడిగా పేర్కొంటూ.. 30 మంది శివసేన ఎమ్మెల్యేలు, నలుగురు స్వతంత్రుల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీకి పంపించారు. మరో ఏడుగురు శివసేన ఎమ్మెల్యేలు తనతో చేరితే.. పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అనర్హత వేటు పడకుండానే ఏక్‌నాథ్ షిండే శివసేనను చీల్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa