ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనకు ప్రాణ హానీ ఉందని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం కలకలంరేపింది. గత మూడు రోజులుగా రఘురామ ఇంటి ముందు రెక్కీ నిర్వహించడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి పట్టుబడగా.. మిగిలినవారు అక్కడి నుంచి పారిపోయారు. అతడిని పట్టుకుని ప్రశ్నించగా.. ముందు పొంతన లేని విధంగా.. రకరకాలుగా సమాధానం చెప్పారు. ఒకసారి తన పేరు బాషా అని, మరొకసారి సుభాన్ అన్నాడు. ఇంకొకసారి డిపార్టుమెంట్కు చెందిన వ్యక్తినని.. విజయవాడ, హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తూ ఉంటానని చెప్పాడు.
తాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చినట్లు ఆ వ్యక్తి రఘురామ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటం.. ఏఆర్ కానిస్టేబుల్నని, క్రైమ్ పోలీసునని చెప్పినట్లు తెలుస్తోంది. అతడిని పోలీస్ ఐడీ కార్డ్ చూపించాలని అడగ్గా.. గుర్తింపు కార్డు లేదన్నాడు. వీఆర్లో ఉన్న తనను ఉన్నతాధికారులే ఇక్కడకు తీసుకు వచ్చారని చెప్పుకొచ్చాడట. తనతో పాటు వచ్చిన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని ప్రశ్నించగా.. అతడు సమాధానం చెప్పలేదు. రఘురామ సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్ను స్వాధీనం చేసుకుని.. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి అలియాస్ బాషా పోలీసుల అదుపులో ఉన్నాడు.
మరోవైపు ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు భావించారు. హైదరాబాద్ లింగంపల్లి నుంచి రైలులో భీమవరం బయల్దేరారు.. కానీ బేగంపేట రైల్వే స్టేషన్లో దిగిపోయారు. తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని.. అక్రమంగా కేసులు పెడుతున్నారని రఘురామ ఆరోపించారు. వారిని మరింత ఇబ్బంది పెట్టేలేక తానే పర్యటనను విరమించుకున్నట్లు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa