ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో ఆయన పయనిస్తున్న హెలికాప్టర్ సమీపంలో నల్ల బెలూన్లు ఎగరడం తీవ్ర కలకలం రేపింది. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో భీమవరం వెళ్లారు. అయితే, గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలీకాప్టర్కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న కేసరిపల్లి గ్రామంలో కొంద మంది వ్యక్తులు నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని హెలీకాప్టర్ వెళ్తున్న సమయంలో బెలూన్లు ఎవరు వదిలారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాథ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని... ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆందోళనకు దిగారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హైవేపై నల్ల బెలూన్లతో ప్రధాని గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎయిర్పోర్టు వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ పర్యటనను నిరసిసతూ ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నల్ల బెలూన్లతో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అనంతరం ప్రధాని పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథరావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అనంతరం హౌస్ అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa