భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర భారీగా నష్టపోయింది. ఆస్తీ నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా జరుగుతోంది. భారీ వర్షాల కారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 76 మంది మరణించారు. సుమారు 838 ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు కనీసం 4,916 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్తు నిర్వహణ విభాగం, పునరావాస విభాగం ద్వారా 35 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. తాజాగా మహారాష్ట్ర ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదివారం వెల్లడించింది.
భారీ వర్షాల మధ్య ముంబైలోని ఘట్కోపర్లోని పంచశీల్ నగర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇల్లు నేలమట్టమైంది. అలాగే సతారా జిల్లాలోని ప్రతాప్గఢ్ కోట సమీపంలో బుధవారం మరో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది ప్రమాద నీటిమట్టాన్ని స్థాయిని దాటింది. భారత వాతావరణ శాఖ జూలై 12 నుంచి మహారాష్ట్రలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు మహారాష్ట్రలో వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనల్లో 125 జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరంలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇక కేరళలో నాలుగు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్లోనూ బారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. రాజస్థాన్, కర్ణాటకల్లోనూ పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కర్ణాటక, తెలంగాణల్లో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa