ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రస్తుతం మీడియా కంగారూ కోర్టులను నడుపుతోందని అన్నారు. రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్నికేసుల్లో అనుభవజ్ఞులైన జడ్జిలు కూడా ఇవ్వలేని తీర్పులను మీడియా ఇచ్చేస్తోందని, అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రమణ ఆరోపించారు. దూకుడు, బాధ్యతారాహిత్యం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని జస్టిస్ రమణ అన్నారు. "మీడియా కంగారుగా కోర్టులను నడుపుతున్నట్టు మేము చూస్తున్నాం. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టం." అని ఆయన అన్నారు.
"న్యాయం అందించాల్సిన సమస్యలపై అవగాహన లేని అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం అని రుజువు అవుతున్నాయి. మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి." అని జస్టిస్ రమణ అన్నారు.
అదేవిధంగా ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై భౌతికదాడులు పెరుగుతున్నాయని, ఎటువంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోర్టుల్లో న్యాయమూర్తులు తక్షణమే స్పందించకపోవడాన్ని బలహీనత లేదా నిస్సహాయత అని తప్పుగా భావించరాదన్నారు. అయితే ప్రస్తుతం ప్రింట్ మీడియా కొంచెం జవాబుదారీగా వ్యవహరిస్తోందని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జవాబుదారీతనంతో ఉందని ఎన్వీ రమణ అన్నారు. "ప్రింట్ మీడియాకు ఇప్పటికీ నిర్దిష్ట స్థాయిలో జవాబాదారీతనం ఉంది. అయితే ఎలక్ట్రానిక్ మీడియాకు సున్నా జవాబుదారీతనం ఉంది. సోషల్ మీడియా ఇంకా అధ్వాన్నంగా ఉంది." అని జస్టిస్ రమణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa