కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. కుమార్తె జోయిష్ ఇరానీ అక్రమ బార్ లైసెన్స్తో గోవాలో ఓ రెస్టారెంట్ను నడుపుతున్నట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇదిలావుంటే జోయిష్ ఇరానీ నడుపుతున్న "సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్" అనే రెస్టారెంట్కు గోవా ఎక్సైజ్ కమిషనర్ నారాయణ్ ఎం.గాడ్ షోకాజ్ నోటీసును జారీ చేశారు. రెస్టారెంట్ యజమానులు ఎక్సైజ్ కమిషన్కు నకిలీ డాక్యుమెంట్లున అందించి అక్రమంగా, మోసపూరితంగా లైసెన్స్ పొందారని ఓ న్యాయవాది ఆరోపించారు.
రెస్టారెంట్ యజమానులు ఎక్సైజ్ కమిషన్కు నకిలీ పత్రాలను అందించి... అక్రమంగా లైసెన్స్ పొందారని నోటీసులో ఆరోపణలు చేశారు. గత నెలలో లైసెన్స్ను పునరుద్ధరించిన వ్యక్తి చాలాకాలం క్రితం మరణించాడని పేర్కొన్నారు. "లైసెన్స్ హోల్డర్ 17-05-2021న మరణించినప్పటికీ, లైసెన్స్ గత నెలలో పునరుద్ధరించబడింది" అని నోటీసులో ఉంది. ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఆంథోనీద్గామా పేరుతో రెస్టారెంట్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆంథోని మే 2021లో మరణించారని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మరణించిన వ్యక్తి పేరును ఉపయోగించి రెస్టారెంట్లో మద్యం లైసెన్స్ను దాని యజమానులు పునరుద్ధరించినట్టు వెలుగు చూడడంతో ఈ లైసెన్సు వ్యవహారం వివాదంలో పడింది
నిజానికి ఈ చట్ట వ్యతిరేక చర్య గురించి తెలుసుకున్న లాయర్ రోడ్రిగ్స్ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా రెస్టారెంట్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఉపయోగించిన మోసపూరిత పత్రాలను కనుగొన్నారు. వెంటనే దానిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోవాలో ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న రెస్టారెంట్కు మాత్రమే మద్యం లేదా బార్ లైసెన్స్ పొందవచ్చనని ఆయన అన్నారు. సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ విషయంలో మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విదేశీ మద్యం, దేశీయ మద్యం కోసం గత ఏడాది ఫిబ్రవరిలో యజమానులకు లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలను మార్చారని లాయర్ రోడ్రిగ్స్ ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంపై 29వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. చట్టవిరుద్ధంగా రెస్టారెంట్ను నడుపుతున్నారని, వెంటనే స్మృతి ఇరానీని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ కొట్టిపడేశారు. అవన్ని నిరాధారమైన ఆరోపణలన్నారు. ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కిరత్ నాగ్రా తన క్లయింట్పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మంత్రి స్మృతి ఇరానీ పరువు తీయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa