జార్ఖండ్ రాష్ట్రానికి భారీ వర్షాలే కాదు తాజాగా పిడుగుపాటు కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పిడుగుపాటు ఎపుడు ఎవరికి నష్టంచేకూర్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జార్ఖండ్లోని బొకారో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల దగ్గర శనివారం పిడుగుపడింది. దాంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. జరిదిహ్ బ్లాక్లోని బంద్డిహ్ మిడిల్ స్కూల్లో తరగతులు జరుగుతుండగా.. మధ్యాహ్నం 12.24 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "పాఠశాల సరిహద్దు సమీపంలో పిడుగు పడిన సమయంలో పాఠశాలలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. పిడుగు వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా... అందులో సీరియస్గా ఉన్న ఆరుగురు విద్యార్థులను ఆస్పత్రిల్లో చేర్పించారు." అని జరిదిహ్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉజ్వల్ కుమార్ సోరెన్ చెప్పారు. అయితే ఆ ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని బొకారో జనరల్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు.
పిడుగుపాటుకు స్వల్ప ఇబ్బందికి గురైన మిగతా విద్యార్థులను స్థానిక రిఫరల్ ఆస్పత్రిలో తనిఖీ చేసినట్టు బీడీవో తెలిపారు. అయితే అందులో నలుగురు విద్యార్థులు మినహా మిగతా వారందరూ డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితిని సమీక్షించడానికి డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ బ్లాక్ను సందర్శించారు. ఈ ఘటనపై జరిదిహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లాలన్ రవి దాస్ కూడా స్పందించారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారు.
ఇదిలావుంటే వర్షాల్లో సంభవించే ఉరుములు, మెరుపుల వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అత్యంత సున్నితమైనవిగా గుర్తించిన దేశంలోని ఆరు రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఒకటి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 2021లో జార్ఖండ్లో 4,39,828 పిడుగులు పడ్డాయి. 2020లో అది దాదాపు 4.5 లక్షలకు పెరిగింది. ఇదిలా ఉండగా ఇటీవలె ఉత్తరప్రదేశ్, బీహార్లో పిడుగులు పడడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం యూపీలోనే 14 మంది చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.4లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. బీహార్లో కూడా ఐదుగురు మృతి చెందారు. వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa