ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్ గా తాగి..నెలపై పడకేసిన మహిళీ టీచర్...ఆపై సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Sun, Jul 24, 2022, 12:57 AM

టీచర్లు మద్యం తాగడం అంటే ఎంతో అవమానకరం. అదే మహిళా టీచర్ మద్యం తాగిందంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన. మద్యం తాగి టీచర్లు, ప్రొఫెసర్లు క్లాస్‌రూమ్‌లకు తూలుతూ వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా చత్తీస్‌గఢ్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు మద్యం మత్తులో తరగతి గదికి వెళ్లడమే కాకుండా క్లాస్‌ రూమ్‌లో ఫ్లోర్‌పై హాయిగా పడుకుంది. విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలో ఈ విషయం బయటపడింది. రాయ్‌పూర్‌కు 430 కిలోమీటర్ల దూరంలోని జష్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ శివార్లలోని టికైత్‌గంజ్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.


జష్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిద్ధిక్ ఆకస్మిక తనిఖీలో భాగంగా ఉదయం 11 గంటలకు జష్‌పూర్ బ్లాక్‌లోని టికైత్‌గంజ్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అయితే ఆ సోదాల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలు జగపతి భగత్ తాగి.. తరగతి గది నేలపై పడుకుని ఉండడం, పిల్లలు గదిలో ఆడుకుంటూ ఉండడం కనిపించింది. దాంతో విద్యార్థుల దగ్గర నుంచి ఆరా తీయగా ఆమె మద్యం తాగిందని చెప్పారు. అలా చెప్పగానే అధికారి మరింత షాక్ అయ్యారు.


"పిల్లలు ఆడుకుంటుండగా తరగతి గదిలో నేలపై పడి ఉన్న టీచర్‌ని చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. మొదట్లో ఆమె అనారోగ్యానికి గురైందని అనుకున్నాను. తరగతి గదిలో ఉన్న 3, 4 తరగతి పిల్లలతో నేను ఆమె ఆరోగ్యం గురించి అడగగా.. నేను మరింత షాక్ అయ్యాను. ఆమె మద్యం తాగిందని పిల్లలు చెప్పారు. ఆమె కుర్చీలో కూర్చోవడానికి సహాయం చేయమని నేను పిల్లలను అడిగాను." అని సిద్ధిక్ చెప్పారు. స్కూల్లో ఉన్న 54 మందికి ఆమె పాఠాలు బోధిస్తున్నట్టు అధికారి తెలుసుకున్నారు.


వెంటనే బీఈవో సిద్ధిక్ అదనపు ఎస్పీ ప్రతిభాపాండేకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పారు. ఆ తర్వాత టీచర్‌ని మెడికల్ చెకప్‌కి పంపేందుకు కానిస్టేబుళ్లను పంపమని కోరారు. ఏఎస్పీ, బీఈవో ఆదేశాల మేరకు వెంటనే ఇద్దరు పోలీసులను పాఠశాలకు పంపించి, భగత్‌ను పోలీసు వ్యాన్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు భగత్‌ను పరీక్షించి.. ఆమె మద్యం సేవించినట్టు నిర్ధారించారు. ఈ పరిణామంతో జిల్లా విద్యాశాఖాధికారి భగత్‌ను సస్పెండ్ చేశారు.


గత కొన్ని రోజులుగా జగపతి మద్యం మత్తులో పాఠశాలకు వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారని, ఈ అలవాటు మానుకోవాలని పాఠశాల కమిటీ భగత్‌ను హెచ్చరించినా వినిపించుకోలేదని విద్యాశాఖ అధికారి తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్తీ భగత్ కూడా పలు సందర్భాల్లో ఆమెను హెచ్చరించారని బీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా జూన్ 16న అకడమిక్ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి జష్‌పూర్ జిల్లాలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఐదుగురు టీచర్లలో ముగ్గురు మద్యం తాగి పాఠశాలకు వచ్చినందుకు సస్పెండ్ చేసినట్లు డీఈవో కార్యాలయం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa