ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో నాలుగు రైతు కుటుంబాలకు శుక్రవారం ఉగ్రవాద సంస్థ ఐసీస్ నుంచి బెదిరింపు లేఖలు అందాయి. ఈ పరిణామం భయాందోళనలకు దారితీసింది. షాబాద్లోని అన్వా గ్రామంలోని కొన్ని ఇళ్ల బయట ఎన్వలప్లలో చుట్టి ఉన్న లెటర్లు కనిపించాయి. ఆ లేఖల్లో సరీన్ గ్యాస్ దాడి చేస్తామని, 2024లో పెద్ద కుట్ర జరుగుతుందని హెచ్చరించారు. తమ సంస్థకు చెందిన మ్యాప్, పెన్ డ్రైవ్ తిరిగి ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని హెచ్చరించారు.
ఈ బెదిరింపు లేఖలపై ఆ కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. అలాగే తమ దగ్గర ఎలాంటి పరికరాలు లేవని కూడా పోలీసులకు చెప్పాయి. ఈ ఘటన రాష్ట్ర పోలీసు శాఖను, నిఘా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఆ లేఖ గురించి తెలుసుకునే పనిని ఇంటెలిజెన్స్ బ్యూరోకు అప్పగించారు. ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో చేతి రాతతో రాసిన ఆ లేఖల్లో దర్యాప్తు సంస్థల పేర్లు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు కూడా ఉన్నాయి.
"చేతి రాతతో నాలుగు లేఖలు ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా చెప్పుకునే వ్యక్తి రాసినవే. కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తూ లేఖలో ఐఎస్ఐఎస్ అని రాసి ఉంది. మేము ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచ్కు తెలియజేసి, లేఖ మూలాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఈ ప్రాంతంలో భద్రతను పెంచాం అని షహబాద్ ఎస్పీ చెప్పారు. అలాగే ఇది ఉత్తుత్తి బెదిరింపా..? నిజంగా హానికరమైన హెచ్చరికా..? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ లేఖను బాగా చదువుకున్న వ్యక్తి రాసినట్టు భావిస్తున్నామని, ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలేవీ లేవని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa