కేంద్ర పర్యావరణ, అటవీశాఖ (ఎంవోఈఎఫ్) అనుమతులు ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరిపినా, నిర్మాణాలు చేపట్టినా కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామని ఏపీ రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. విశాఖ రుషికొండ తవ్వకాల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి తవ్వకాలు జరిపారని నిర్ధారణైతే బాధ్యులైన అధికారులకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. కూల్చివేతలు జరిపిన 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుపుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తు చేసింది. అలాగే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ (ఎంవోఈఎఫ్) అనుమతులు ఉల్లంఘించి తవ్వకాలు జరిపినా, నిర్మాణాలు చేపట్టినా కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామని తేల్చి చెప్పింది.
రుషికొండ వ్యవహారంలో.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్కి విరుద్ధంగా విశాఖ జిల్లాలో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన పార్టీ నేత మూర్తి వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరగ్గా.. తాజాగా బుధవారం కూడా విచారణ జరిగింది. ఎంవోఈఎఫ్ అనుమతులకు మించి రిషికొండపై తవ్వకాలు జరిపారని పిటిషనర్ల తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. దాదాపు 20 ఎకరాలను తవ్వేశారని.. ఆ వ్యర్థాలను వినియోగంలో లేని పార్కుతోపాటు చింతలుప్పాడ సముద్ర తీరాన పోస్తున్నారన్నారు.
దీంతో కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఆదేశాలు ఉల్లంఘించిన అధికారుల జైలుకి వెళ్లక తప్పదని హెచ్చరించింది. ఎంవోఈఎఫ్ అనుమతులు, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారని.. అందుకే కమిషన్ను నియమిస్తామని తెలిపింది. ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధంకాగా.. ఏపీ టూరిజం కార్పొరేషన్ తరఫున లాయర్ స్పందించారు. పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదని.. వారు లేవనెత్తిన అంశాలపై తాము ఇచ్చే సమాధానాన్ని పరిశీలించిన తర్వాత కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలను ఎక్కడా ఉల్లంఘించలేదని.. ముందుస్తుగా ఎలాంటి నిర్ణయానికి రావొద్దని కోరారు.
ఆదేశాలు ఉల్లంఘించి తవ్వకాలు జరుపుతున్నారని పిటిషనర్లు మొదటినుంచీ ఆరోపిస్తున్నారని.. అధికారులు అన్ని విషయాలు 'మీ' దృష్టికి తీసుకురాకపోయి ఉండొచ్చని లాయర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అందుకే సంబంధిత జిల్లా జడ్జి నేతృత్వంలో కమిషన్ వేసి.. అక్రమాలు నిర్ధారణ అయ్యాక కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని ఎవరైనా పరిశీలించారా అని పిటిషనర్ల తరఫు లాయర్లను ప్రశ్నించింది. తాను స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చానని ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.
తవ్వకాల వల్ల వచ్చిన మట్టి వ్యర్థాలను చింతలుప్పాడ సమీపంలో నిరుపయోగంగా ఉన్న భూమిలో పోస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ అన్నారు. ఆ ప్రాంతం బంగాళాఖాతం కిందకు రాదని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందే రుషికొండ సమీపంలోని బస్ షెల్టర్ తొలగించామని తెలిపారు. ఇరువైపుల లాయర్ల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్పై రిప్లై అఫిడవిట్ వేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆ వివరాలు పరిశీలించిన తరువాత కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa