ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణమస్తుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్..ఇలా దరఖాస్తు చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 03:57 PM

పేదల పెళ్లిళలకు సంబంధించిన కళ్యాణమస్తు పథకానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆధర్యంలో ఆగస్టు 7న కళ్యాణమస్తు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈనెల 29న శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణాల తేదీ కంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కళ్యాణమస్తు దరఖాస్తుకు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.


వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, వృత్తి, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, వారివారి పూర్తి చిరునామాను పొందు పరచాలి. వధూవరులు విడివిడిగా వారి మొబైల్‌ ఫోన్‌ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో తాము భారతీయ హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని కచ్చితంగా స్పష్టం చేయాలి.


జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు తగిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వివాహం నాటికి వధూవరులు మేజర్లమని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని సగోత్రికులం కాదని స్పష్టం చేయాలి. వధూవరుల తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నామని.. ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్‌–8 హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం రిజిష్టర్‌ చేయించుకునే బాధ్యత తమదేనని తెలియజేయాల్సి ఉంటుంది.


న్యాయ, ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తామని.. వివాహం కుదుర్చుకోవడంలో బాధ్యత తమదేనని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని జంటతో పాటూ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది. వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం స్కూలు సర్టిఫికెట్‌, లేని పక్షంలో ఆధార్‌కార్డు జతపర్చాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్‌ ప్రతులను కూడా జత చేయాలని సూచించారు. వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్‌ ధ్రువీకరణ కూడా ఉండాల్సిందే. కళ్యాణమస్తుకు సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 7న నక్షత్ర యుక్త సింహలగ్నంలో ఉదయం 8 గంటల నుంచి 8:17 నిమిషాల మద్య సామూహిక వివాహాలకు ముహూర్తం ఖరారు చేశారు.


ఈ కళ్యాణమస్తును టీటీడీ 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభించింది. పేద హిందువులు వివాహం చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. టీటీడీ తరఫున నిర్వహించే కళ్యాణమస్తులో పెళ్లి చేసుకునే జంటకు బంగారు తాళి బొట్టు, వస్త్రాలు, వారి బంధువులు 50 మందికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసేవారు. 2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతల్లో ఈ కార్యక్రమం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తును ఘనంగా నిర్వహించాలని భావించింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు 7న కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa