సినిమాల్లో మాత్రమే మనం మంచి దొంగ చూసివుంటాం. నిజ జీవితంలోనూ ఓ మంచి దొంగ ఉన్నాడని నిరూపించాడో వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలో వింత చోరీ జరిగింది. దొంగతనం చేసిన ఇంట్లోనే తిరిగి డబ్బుల్ని పెట్టి ఓ లేఖను ఉంచి వెళ్లిపోయాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బెజ్జిపురపు చక్రధరరావు కుటుంబంతో కలిసి ఆదివారం బంధువుల ఊరెళ్లాడు. అదేరోజు రాత్రి ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. చక్రధరరావు సోమవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉండటాన్ని గమనించడు. బీరువాలో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆదివారం రాత్రి ఓ ఇంట్లో రూ.11.20 లక్షల డబ్బులు చోరీ అయ్యాయి. వెంటనే ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో క్లూస్టీం తనిఖీలు నిర్వహించారు. ఇంతలో సోమవారం రాత్రి ఇంటి వెనుక తలుపునకు వేసిన మరో తాళాన్ని దుండగుడు విరగ్గొటి లోపలికి వెళ్లాడు. అతడు డబ్బుల్ని ఇంట్లో పెట్టి ఓ లేఖను అక్కడే ఉంచి వెళ్లాడు. ఇంటి యజమాని చూసి మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ డబ్బును, లేఖను స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల్ని కోర్టుకు అప్పగించారు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ దుండగుడు రాసిన లేఖలో ‘సారీ అన్నయ్య.. సారీ వదిన.. తప్పు చేశాను.. ఇదే నా మొదటి దొంగతనమని, క్షమించమని, నన్ను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో దొంగతనం కలకలంరేపింది. స్థానిక ఆధ్యాత్మిక వేత్త పెరంబదూరు సూరిబాబు ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ నెల 22న సూరిబాబు కుమార్తె విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. దీంతో ఆయన ఇంటికి తాళాలు వేసి అక్కడకు వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు గునపంతో ఇంటికి ఉన్న గెడను పగులగొట్టి లోపలకు చొరబడ్డారు. ఇంట్లోని రెండు బీరువాల తాళాలు అందుబాటులో ఉన్నాయి. ఆ తాళాలు తెరిచి లోపల ఉన్న రూ.1.50 లక్షల డబ్బులు, సుమారు 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
సూరిబాబు పొరుగింట్లో వాళ్లు ఇంటి గెడ విరిగి ఉండటాన్ని గమనించి విషయాన్ని సూరిబాబుకు ఫోన్ చేసి చెప్పారు. టూ టౌన్ పోలీసులకు సమాచారం వెళ్లడంతో ఘటనా స్థలానికి చేరుకుని.. క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలను సేకరించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయని.. ప్రజలు ఎల్హెచ్ఎంఎస్ను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa