ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయువు లీకేజీతో 150మందికి పైగా మహిళా ఉద్యోగుల అస్వస్థత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 05:20 PM

ఓ కంపెనీలో వాయువు లీకేజీతో దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు మరోసారి కలకలం సృష్టించింది. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీతో దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహకోల్పోగా.. పరిశ్రమ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స అందజేశారు. మరి కొందరని బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయానికి దాదాపు 4వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.


రెండు నెలల వ్యవధిలోనే విషవాయువు లీకవడం ఇది రెండోసారి. జూన్ 3న జరిగిన ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కార్మికులు బయటపడుతుండగా.. ఇంతలోనే మరోసారి విషవాయువు విడుదల కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో పోరస్‌ ల్యాబరేటరీ నుంచి గ్యాస్ విడుదలైందని చెప్పడంతో దీనిని చాలామంది నమ్మి విధులకు హాజరయ్యారు. కంపెనీ నిర్వహణ గాడిలో పడుతున్న దశలో మరోసారి గ్యాస్‌ లీక్ కావడంతో సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమ నుంచే ప్రమాదకరమైన గ్యాస్‌ విడుదలైందని కార్మికులు భావిస్తున్నారు.


జూన్‌లో సీడ్స్‌ దుస్తుల కంపెనీ దాని సమీపంలోని పోరస్‌ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో గ్యాస్ లీకేజీపై నివేదికలు తీసుకుంది. కాగా, సీడ్స్‌లో రెండోసారి విషవాయువు లీకేజీ జరగడంపై అధికారులు సమగ్ర పరిశీలన చేయాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆదేశించారు.


అయితే, విష వాయువు లీకేజీ ఘటనపై బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రసాయన వాయువు లీకై మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురికావడం అంతుపట్టడం లేదని వ్యాఖ్యానించారు. గ్యాస్ లీకేజ్ ప్రమాదమా? కావాలనే ఎవరైనా విషవాయువులను విడుదల చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. జూన్‌ 3 నాటి ఘటనతో అప్రమత్తమై సీడ్స్‌ కంపెనీతో పాటు బ్రాండిక్స్‌ ఇతర యూనిట్లలో ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశామని దొరస్వామి గుర్తుచేశారు. అయితే, సీడ్స్‌లో తాజాగా విడుదలైన గ్యాస్‌ని ఆధునిక వ్యవస్థ గుర్తించకపోవడం విచిత్రంగా ఉందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa