ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు. అలాంటి ఘటనే గుంజూరుజిల్లాలో నెలకొంది. గేదెల వల్ల దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదుతో.. వాటిని తీసుకెళ్లి అధికారులు సచివాలయంలో కట్టేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పశువులను కూడా మీ దగ్గరే ఉంచుకోండని మరికొన్ని గేదెలను, ఆవులను సచివాలయం వద్ద కట్టివేసి నిరసన తెలిపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు శివారులోని ఏటుకూరుకు చెందిన బూరగడ్డ శ్రీనివాస్ తన గేదెలను ఇంటి వద్దనే పాకలో ఉంచుతున్నాడు. అయితే, వాటివల్ల దుర్వాసన వస్తోందని, భరించలేక పోతున్నామని చుట్టుపక్కల ఉన్న కొందరు ఏడాది నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రతిసారీ అర్జీ రీఓపెన్ అవుతుండటంతో సచివాలయ సిబ్బందిపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు.. గత ఆదివారం ఆ గేదెలను తీసుకువచ్చి స్థానిక వార్డు సచివాలయం వద్ద కట్టేశాడు. రెండు రోజులు గడిచినా వాటికి కనీసం దాణా, నీరు ఇవ్వలేదు. అవి ఆకలి అలమంటించడంతో అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత కక్షతో ఫిర్యాదు చేస్తే గేదెలను శిక్షిస్తారా అంటూ? నిలదీసిన గ్రామస్థులు.. తమ వద్ద ఉన్న పశువులను కూడా సచివాలయం లోపలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకోవడంతో సచివాలయం బయటే గేదెలను కట్టేసి నిరసన తెలిపారు. దీంతో చివరకు చేసేదేమీ లేక ఆ గేదెలను యజమాని శ్రీనివాస్కు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది. సమస్యకు పరిష్కారం చూపకపోతే తన ఉద్యోగం పోతుందని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని శానిటరీ సూపర్వైజర్ వివరణ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa