భార్య...భర్తల మధ్య మనస్పర్థాలు ముగ్గురి మరణాలకు కారణమైంది. ఆవేశం ఓ నిండు కుటుంబంలో పీడకలని మిగిల్చింది. భర్తకు దూరంగా ఉంటున్న భార్యని బతిమిలాడి ఇంటికి తెచ్చిన మూడు రోజులకే శవమై కనిపించింది. భార్యతో పాటు బిడ్డను చంపేసి ఆ తర్వాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. అల్లూరు మండలం ఇస్కపాలేనికి చెందిన ఆవుల మురళి (25)కి ఏడాదిన్నర కింద స్వాతి (20)తో వివాహమైంది. వీరి ఇద్దరి బంధానికి ఐదు నెలల పాప కూడా ఉంది. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో స్వాతి అలిగి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకొచ్చేందుకు మురళి చాలా సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో స్వాతిని మురళి అక్క వెంకటరమణమ్మ ఎలాగొల నచ్చజెప్పి ఈ నెల 4వ తేదీన ఇంటికి తీసుకొచ్చింది. రెండ్రోజులు అంతా మాములుగానే ఉన్నా ఆదివారం తెల్లవారే సరికి ఘోరం జరిగింది.
శనివారం రాత్రి భార్య, పాపతో మురళి ఇంట్లోనే ఉన్నాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తీయలేదు. దాంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా స్వాతి, ఐదు నెలల పాప కింద మృతిచెంది ఉండగా.. మురళి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. మామ గోవిందు, అత్త బంగారమ్మ, ఆడబిడ్డ వెంకట రమణమ్మ కలిసే తమ కూతురు, మనవరాలిని హత్య చేశారంటూ స్వాతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa