మొన్నటి వరకు కర్ణాటకను హిజాబ్ వివాదం కుదిపేసినా తాజాగా టిప్పు సుల్తాన్ పోస్టర్ దగ్ధం వివాదం మొదలైంది. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పోస్టర్పై దుమారం రేగింది. భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ పోస్టర్ను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ దగ్గర కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కొందరి నాయకుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. అందులో టిప్పు సుల్తాన్ పోస్టర్ కూడా ఉంది. అయితే టిప్పు సుల్తాన్ పోస్టర్ను ఎవరో చించి పడేశారు. దాంతో వివాదం రాజుకుంది.
ఘటనా ప్రదేశాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి. శివకుమార్ శనివారం సందర్శించారు. ఆయన ఈ చర్యను ఖండించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ స్వాతంత్య్ర యాత్రను జీర్ణించుకోలేకపోతున్నారని శివకుమార్ విమర్శించారు.
ఆగస్ట్ 15న కాంగ్రెస్ పార్టీ ఫ్రీడం మార్చ్ను చేపట్టనుంది. ఈ పాదయాత్ర సంగొల్లి రాయన్న సర్కిల్ నుంచి ప్రారంభమై బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్స్లో ముగుస్తుంది. దేశం కోసం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడమే పాదయాత్ర లక్ష్యమని డి.శివకుమార్ చెప్పారు. కవాతు ద్వారా వీరులకు నివాళులు అర్పించడం తమ హృదయపూర్వక ప్రయత్నమని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ వివిధ స్వతంత్ర సమరయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. అయితే వాటిల్లో టిప్పు సుల్తాన్ పోస్టర్ ఉండడం వివాదంగా మారింది.
అయితే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అంశంపై పలుమార్లు వివాదాస్పదం అవుతుంది. టిప్పు సుల్తాన్ ప్యాలెస్, విగ్రహాలు, బడుల్లో ఆయనకు సంబంధించిన పాఠాలు వంటి అంశాలపై తీవ్ర వివాదాలు చెలరేగాయి. రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. బీజేపీ టిప్పు సుల్తాన్ను దేశ ద్రోహిగా ఆరోపణలు చేస్తుంటుంది. ఆ వాదనను ప్రతిపక్షాలు తోసిపుస్తుంటాయి. ఇందులో భాగంగానే వివాదాలు రాజుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa