ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌లో రోడ్డుపైకి వచ్చిన మొసళ్లు...జనం బెంబేలు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 08:25 PM

భారీ వర్షాలకు రోడ్లు..చెరువులు ఒకటయ్యాయి...అంతేకాదు చెరువు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జనసంచారమున్న కాలనీలోకి వచ్చేశాయి. దీంతో జనం బెంబేలెత్తారు. సాధారణంగా  మొసళ్లు చెరువుల్లో, నదుల్లో ఉంటాయి. అయితే ఓ మొసలి దారి తప్పి ఏకంగా కాలనీలోకి వచ్చేసింది. దానిని చూసిన వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా..? ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..? కానీ నిజం మధ్యప్రదేశ్‌లోని ఓ నివాస కాలనీలో మొసలి సంచరించింది. భారీ వర్షాల పుణ్యమా అని ఈ వినూత్నమైన ఘటన చోటుచేసుకుంది.


మధ్యప్రదేశ్‌లో శివపురి జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. కాలనీలు కూడా జలమయం అయ్యాయి. అలా ఓ కాలనీలో చేరుకున్న నీళ్లలో ఓ మొసలి సంచరించింది. దానిని చూసిన స్థానికుల గుండె జారినంత పనైంది. అయితే చాలామంది దానిని వీడియోలో బంధించారు. అయితే మొసలి గురించి స్థానిక అధికారులకు తెలియజేశారు. ఒక గంట పాటు కష్టపడి దానిని అధికారులు పట్టుకున్నారు. తెల్లవారుజామున పాత బస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో మొసలి కనిపించిందని అధికారులకు సమాచారం అందించామని సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డీఓపీ) అజయ్ భార్గవ తెలిపారు.


మాధవ్ నేషనల్ పార్క్ నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి గంటపాటు శ్రమించి మొసలిని బంధించామని, ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సాంఖ్యసాగర్ సరస్సులో విడిచిపెట్టామని అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రెసిడెన్షియల్ కాలనీలోని ఇరుకైన సందులో ఉన్న ఓ ఇంటి ముందు నుంచి మొసలి వెళ్తున్న దృశ్యాన్ని అందులో చూడొచ్చు. కాగా అక్కడ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులను ప్రధాన కార్యాలయం నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa