మనదేశం కోసం మన సైనికుల సాహసాలు ఏ మేర ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటి సాహసాల్లో వారు ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. అలాంటి కన్నీళ్లు తెప్పించే ఓ ఘటన ఇది. పెట్రోలింగ్లో ఉండగా మిస్సైన ఆర్మీ జవాన్ మృతదేహం 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లోని పాత బంకర్లో జవాన్ మృతదేహం ఆదివారం బయటపడింది. ఈ మృతదేహాన్ని 19 కుమావోన్ రెజిమెంట్కు చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా రాణిఖెట్లోని సైనిక్ గ్రూప్ సెంటర్ గుర్తించింది. సియాచిన్ హిమనీ నదం ప్రాంతంలో పాకిస్థాన్ కుట్రలను ముందుగానే పసిగట్టిన భాత్.. 1984 ఏప్రిల్ 13న ‘ఆపరేషన్ మేఘ్దూత్’ ను చేపట్టింది. ఇందులో భాగంగా 20 మంది జవాన్ల బృందంతో పెట్రోలింగ్ నిర్వహించింది. ఈ బృందంలో చంద్రశేఖర్ హర్బోలా కూడా ఒకరు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. భారీ హిమపాతంలో సైనికులు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో 15 మంది సైనికుల మృతదేహం లభ్యంకాగా.. హర్బోలా సహా ఐదుగురు జవాన్ల ఆచూకీ లభించలేదు.
ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన చంద్రశేఖర్ హర్బోలాకు భార్య శాంతి దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వారి కుటుంబం హల్దవానీలో ఉండగా.. మృతదేహాన్ని అక్కడకు పంపుతున్నామని, సోమవారం రాత్రికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అమర జవాన్కు అంత్యక్రియలు నిర్వహిస్తామని హల్దవానీ సబ్-కలెక్టర్ మనీశ్ కుమార్ పేర్కొన్నారు.
చంద్రశేఖర్ భార్య శాంతి దేవి మాట్లాడుతూ.. వివాహమైన తొమ్మిదేళ్ల తర్వాత తన భర్త గల్లంతయ్యారని, అప్పటికి నా వయసు 28 ఏళ్లు కాగా.. పెద్ద కుమార్తెకు నాలుగు, చిన్న కుమార్తెకు ఏడాదిన్నర వయసని తెలిపారు. చివరిసారిగా 1984 జనవరిలో ఇంటికొచ్చిన తన భర్త.. త్వరలోనే వస్తానని అప్పుడు మాటిచ్చారని గుర్తుచేసుకుంది. అయితే, తన భర్త కుటుంబానికి చేసిన వాగ్దానాల కంటే దేశం కోసం చేసిన సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన భార్యగా తాను గర్వపడుతున్నానని శాంతి దేవి అన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చంద్రశేఖర్ 1975లో ఆర్మీలో చేరారు. కాగా, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అక్కడ మరో మృతదేహం కూడా లభ్యమైనా.. అది ఎవరిదీ అనేది గుర్తించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa