బాలీవుడ్ నటి సెలినా జైట్లీ తన భర్త, ఆస్ట్రియాకు చెందిన హోటల్ వ్యాపారి పీటర్ హాగ్పై ముంబై కోర్టులో గృహ హింస కేసు దాఖలు చేశారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో భర్త నుంచి శారీరక, మానసిక, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించారు. పరిహారంగా రూ.100 కోట్లతో పాటు, నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సెలినా జైట్లీ నవంబర్ 25న అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరుపక్షాలనూ తమ ఆదాయ వివరాలతో కూడిన అఫిడవిట్లను జనవరి 27లోగా సమర్పించాలని ఆదేశించింది. గృహ హింస చట్టం కింద దాఖలైన ఈ ఫిర్యాదుపై సమాధానం ఇవ్వాలని పీటర్ హాగ్ను కోర్టు ఆదేశించింది.తన పిటిషన్లో సెలినా పలు తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని భర్త హరించాడని పేర్కొన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడానికి కూడా అతని అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, తన సంపాదనను పరిమితం చేసి ఆర్థికంగా తనపై ఆధారపడేలా చేశాడని ఆమె వివరించారు. తన డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఖాతాల నుంచి డబ్బును దొంగిలించాడని కూడా ఆరోపించారు.ప్రస్తుతం ఆస్ట్రియాలో భర్త వద్ద ఉన్న తమ ముగ్గురు పిల్లల కస్టడీని కూడా తనకు అప్పగించాలని సెలినా కోరారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులోనే పీటర్ ఆస్ట్రియా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. అక్కడ కూడా విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa