తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వర్ణకమలం’, ‘రాధాగోపాలం’ వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలకు నృత్యాలు సమకూర్చి సూపర్ హిట్ చేసిన ప్రముఖ నృత్య దర్శకుడు శ్రీను మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆదివారం ఉదయం చెన్నైలోని టినగర్లో ఉన్న తన నివాసంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూసారు.
కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప దంపతులకు జన్మించారు. ఢిల్లీ రవీంద్ర భారతిలో ప్రిన్సిపాల్గా పనిచేసిన గురు సుందర్ ప్రసాద్ వద్ద కథక్ నేర్చుకున్నారు.1956లో ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన ‘నేనంటే నేనే’ చిత్రంతో డాన్స్ మాస్టర్గా అరంగేట్రం చేశారు. తర్వాత ‘మహాబలుడు’, ‘భక్తకన్నప్ప’, ‘ఎదురులేని మనిషి’, ‘యుగపురుషుడు’, ‘దొరబాబు’, ‘యుగంధర్’ వంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘స్వర్ణకమలం’, ‘రాధాగోపాలం’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలకుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా నంది అవార్డులను అందుకున్నారు. 1700 సినిమాలకు పైగా నృత్యాలను సమకూర్చిన ఆయన ఎనిమిది భాషల్లోని చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు.. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు విజయ్ శ్రీనివాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. చెన్నైలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa