కేంద్రం విదిస్తోన్న వినోద పన్నుతో పాటు ఇతర కారణాలు, ఖర్చుల వల్ల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది మే నెలలో థియేటర్ యజమానుల సంఘం ఒక ప్రకటన కూడా చేసింది. ఈ ప్రకటన అప్పట్లో సంచలనం అయ్యింది. థియేటర్ యజమానులు చేసిన ప్రకటనతో తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు స్టార్ హీరోలు షాక్ గురయ్యారు. థియేటర్ యజమానుల ప్రకటన సబబు కాదని, వారి డిమాండ్లను అమలు చేయడం అసాధ్యమని భారతీరాజా వంటి దిగ్గజ దర్శకుడు భహిరంగంగా చెప్పారు. అయితే, చాలా రోజుల తర్వాత మళ్లీ థియేటర్ యజమానులు తమ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు తాజాగా మళ్లీ ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్ను 8 శాతం వెంటనే రద్దు చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. పెద్ద చిత్రాల ద్వారా నష్టపోతే ఆ చిత్ర నటీనటులు, నిర్మాతలే భరించాలని డిమాండ్ చేశారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను 100 రోజుల వరకు డిజిటల్ ప్లాట్ఫాంలలో విడుదల చేయకూడదని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని కాదని డిజిటల్ ప్లాట్ఫాంలలో విడుదల చేస్తే ఆ నిర్మాతల సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. తమ మొత్తం డిమాండ్లను అంగీకరించకపోతే మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను మూసివేస్తామని స్పష్టం చేశారు. దీంతో మరోసారి తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలకు షాక్ తగిలినట్టయింది. మరి దీనిపై తమిళ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa