పెద్దల మాటలను గౌరవించకపోతే విపరిణామాలు ఎదురవుతాయని మన భారత, భాగవత, రామాయణ గాథలు తెలియజేస్తాయని, పెద్దలు చెప్పినదాన్ని వినకపోతే ఏం జరుగుతుందో ప్రస్తుతం కనిపిస్తోందని కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహన్బాబు చెప్పారు. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ప్రధాని మోదీ దగ్గర్నుంచి పెద్దలు చెబుతున్న సూచనలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాలను ఒక వీడియో సందేశం ద్వారా ఆయన తెలిపారు.
మోహన్బాబు మాట్లాడుతూ, "ప్రకృతిని గౌరవించాలని ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది.. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిస్తున్న సంగతీ అర్థమై ఉంటుంది. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసుంటుంది. భారత, భాగవత, రామాయణ గాథలను మీరు చదివే ఉంటారు. రామాయణంలో వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు. మళ్లీ వెంటనే వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య భర్తకు ఏమండీ.. ఇప్పుడే వెళ్లాడు. రక్తపు మరకలు కూడా ఆరి ఉండవు. వెంటనే మళ్లీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో మర్మం ఉంది. వెళ్లకండి అని చెప్పింది. భార్య మాటను వాలి వినలేదు. వినాశకాలే విపరీత బుద్ధిః.. అతనికి ఆమె చెప్పిన మంచి రుచించలేదు. వెళ్లాడు, ఓడిపోయాడు.. చనిపోయాడు. అలాగే సీతా మహాసాధ్విని గీత దాటొద్దని లక్ష్మణుడు చెప్పాడు. ఆమె గీత దాటింది. అంటే పెద్దల మాటను గౌరవించకపోతే విపరిణామాలు జరుగుతాయని ఈ కథలు చెబుతాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ 'మీరు ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి.. ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు ఇంట్లో ఉండండి.. భగవంతుడ్ని ప్రార్థించండి.. ఈ కరోనా వ్యాధి వెళ్లిపోవాలని ప్రార్థించండి. బయటకు వచ్చి ఇష్టమొచ్చినట్లు నడచుకోకండి' అని చెప్తున్నాఎవరూ వినడం లేదు. వాళ్ల ఇష్టప్రకారం నడుచుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలను గౌరవించినప్పుడే మనం బాగుంటాం, పక్కింటివాళ్లూ బాగుంటారు. రాష్ట్రం బాగుంటుంది, యావత్ ప్రపంచమూ బాగుంటుంది. అతి త్వరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa