‘మేడమీద అబ్బాయి’ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన మలయాళ కుట్టి నిఖిలా విమల్. ఆ తరవాత ‘గాయత్రి’ సినిమాలోనూ నటించారు. మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ నటి ప్రస్తుతం కోవిడ్-19 కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. పేద ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేయడానికి కేరళలోని కన్నూర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్లో తన సేవలు అందిస్తోన్న నిఖిలా విమల్.. ప్రజలు చేస్తోన్న ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకుని వారికి కావాల్సిన మెడిసిన్స్, ఇతర నిత్యావసరాల జాబితాలను తయారు చేస్తున్నారు. ‘‘పేదలకు సేవ చేయడానికి ప్రముఖ వ్యక్తులు ముందుకు రావాలని హెల్ప్ సెంటర్ నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో నేను స్వచ్ఛందంగా ఈ మిషన్లో చేరాను. ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చేయడమే ఈ మిషన్ ముఖ్యోద్దేశం. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు బయటికి రానవసరం లేదు. మా వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తారు’’ అని నిఖిలా చెప్పారు. అయితే, తానెవరో చెప్పకుండా కాలర్స్తో మాట్లాడుతున్నానని నిఖిలా స్పష్టం చేశారు. తాళిపరాంబలోని తన ఇంటి నుంచి రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి హెల్ప్ సెంటర్కు చేరుకుంటున్నారు నిఖిలా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa