బాలీవుడ్ సింగర్ కనికాకపూర్కు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో దేశవ్యాప్తంగా వివాద అంశాల్లో ఒకటిగా మారింది. మార్చి 20న నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో కనికా కరోనా బారిన పడ్డారనే విషయంతో ఒక్కసారిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. అందుకు కారణం మాజీ సీఎం వసుంధరా రాజే కుటుంబంలో జరిగిన ఓ విలాసవంతమైన విందుకు ఆమె హాజరుకావడమే. ఆ తర్వాత అనేక రూమర్లు, ఊహాగానాలు ఆమెను చుట్టుముట్టాయి. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకొని లక్నోలోని తన కుటుంబ సభ్యులతో లాక్డౌన్ పిరియడ్ను కొనసాగిస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు మళ్లీ అందరి కనుబొమ్మలు ఎగిరేసేలా చేశాయి. ఆమె పెట్టిన సుదీర్ఘమైన పోస్టులో ఏమున్నదంటే..."యూకే, ముంబై, లక్నోల్లో నేను కలిసిన వ్యక్తుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. నాకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి పరీక్షలు చేయిస్తే నెగిటివ్ అని తేలింది. కరోనా వైరస్ గురించి తెలిసి కూడా నేను కొంత తప్పు చేశాను కాబట్టే, ఇన్నాళ్లూ నోరు మెదపకుండా ఉన్నాను. నన్ను దోషిగా చూపిస్తూ అనేక కథనాలు, ప్రచారం చేశారు. వాటికి కాలమే సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్యానించారు.తన వైపు కొంత తప్పు ఉండబట్టే, ఇంతకాలమూ వచ్చిన కథలు, రూమర్లపై స్పందించదలచుకోలేదని చెప్పుకొచ్చిన ఆమె, ఏదో రోజు అసలు విషయం బయటకు వస్తుందనే భావించానని, తనపై అసత్యాలు ప్రచారం చేసిన వాళ్లు పశ్చాత్తాప పడి తీరుతారని పేర్కొంది.కాగా, మార్చి 10న యూకే నుంచి ముంబైకి వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు. అప్పటికి హోమ్ క్వారంటైన్ నిబంధన లేకపోవడంతో ఆమెను బయటకు పంపించారు. 11న ఆమె బంధువులను కలిసేందుకు లక్నో వెళ్లింది. ఆపై మార్చి 18న క్వారంటైన్ నిబంధనలు విడుదలయ్యాయి. ఈలోగా కనికా కపూర్ పలు పార్టీలకు వెళ్లింది. మార్చి 17, 18 తేదీల్లో ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. యూపీ పోలీసులు ఆమె నిబంధనలను అతిక్రమించిందని కేసు కూడా రిజిస్టర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa