ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంజీఆర్ లాంటి పాలన అందిస్తా: రజినీకాంత్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 11:26 AM

తమిళనాడు ప్రజల దీవెనలు తనకు ఉంటే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అందించినట్లే మంచి పాలనను అందిస్తానని సూపర్స్టార్ రజినీకాంత్ అన్నారు. ఎంజీఆర్ తనకు మంచి మిత్రుడని తెలియజేశారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటుచేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ విగ్రహాన్ని సోమవారం రజినీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంజీఆర్కు మధ్య ఉన్న అనుబంధం గురించి చాలా మందికి తెలియదని చెప్పారు.


ఎవరూ ఎంజీఆర్ లా చేయలేరు అని వారంటారు. దానికి నేను అంగీకరిస్తాను. ఎంజీఆర్ ఒక విప్లవకారుడు. వచ్చే 1000 సంవత్సరాల్లో మరో ఎంజీఆర్ రాలేడు. ఎవరైనా తానే తరవాత ఎంజీఆర్ అని చెప్పుకుంటే అతనికి పిచ్చి పట్టిందని లెక్క. కానీ తమిళనాడు ప్రజలకు ఎంజీఆర్ అందించిన సుపరిపాలనను నేను కూడా అందించగలననే విశ్వాసం నాకు ఉంది’ అని రజినీకాంత్ అన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని రజినీ చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ‘మీరు (ప్రత్యర్థులు) నాకు రెడ్ కార్పెట్ వేయాలని నేను ఆశించడంలేదు. కానీ ఎందుకు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు?’ అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి రజినీ అన్నారు.


రాజకీయాలు అంత సులభమైన మార్గం కాదని తనకు తెలుసని రజినీ వెల్లడించారు. ‘దీనిలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయని, ఇది విషపూరితమని, ముళ్లబాటని నాకు తెలుసు. మీరు ఏంచేస్తున్నారో కూడా నాకు తెలుసు. కానీ నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు’ అని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఉద్దేశించి రజినీ విమర్శలు చేశారు. అలాగే ఆధ్యాత్మిక రాజకీయాలకు అర్థం ఏమిటో కూడా రజినీ వివరించారు. ‘ఆధ్యాత్మిక రాజకీయాలు అంటే ఏమిటి? అని వారు నన్ను అడుగుతున్నారు. నిజమైన, పరిశుద్ధమైన, నిజాతీయ కలిగిన రాజకీయాలే ఆధ్యాత్మిక రాజకీయాలు. మన జీవితం మొత్తం ఆధ్యాత్మిక రాజకీయాలకు సమానమని నా నమ్మకం. దేవుడి నమ్మడం కూడా ఆధ్యాత్మకి రాజకీయాలే’ అని రజినీ వెల్లడించారు.


జయలలిత ప్రాణాలతో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారు అని ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పిన రజినీ దానికి వివరణ ఇచ్చారు. ‘జయలలిత ప్రాణాలతో ఉన్నప్పుడు 1996లో ఆమె కోసం నేను నా గళాన్ని వినిపించాను. ఈ విషయాన్ని ప్రజలకు నేను గుర్తుచేయాల్సిన అవసరం లేదనకుంటా. నేను ఎవరికీ భయపడను. నేను ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఏర్పడింది. తమిళనాడులో సుపరిపాలనకు, నాయకత్వానికి ఖాళీ ఏర్పడింది’ అని రజినీ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa