ఇండియన్ సినిమాల్లో పాటలు లేకుండా సినిమాలు తీయడం అరుదు. ఇది దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయం. ప్రేక్షకులు కూడా వాటికి బాగా అలవాటు పడిపోయారు. కానీ కొంత కాలంగా ట్రెండ్ మారుతోంది. హాలీవుడ్ సినిమాలకు మన ప్రేక్షకులు బాగా అలవాటు పడి.. పాటల విషయంలో కొంత అసహనం చెందుతున్నారు. పాటల్ని డీవియేషన్గా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో తక్కువ పాటలుంటున్నాయి. కొన్నింట్లో అయితే అసలు పాటలే ఉండట్లేదు.
ఐతే మిగతా వాళ్ల అభిప్రాయం ఎలా ఉన్నా.. సినీ గేయ రచయితలు ఎవ్వరైనా సరే.. సినిమా పాట పది కాలాల పాటు ఉండాలని.. సినిమాల్లో పాటలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అనుకుంటారు. కానీ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని.. సినిమా పాటలకు ఆదరణ తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు పద్మశ్రీ పురస్కారం వచ్చిన నేపథ్యంలో మీడియాను కలిసిన ఆయన ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో పాటలొస్తుంటే ప్రేక్షకులు లేచి వెళ్లిపోతున్నారని.. పాటల్ని భారంగా భావిస్తున్నారని.. కాబట్టి పాటలు తగ్గించుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అని నిర్మాతలకు చెప్పాలని తనకు అనిపిస్తూ ఉంటుందని సిరివెన్నెల చెప్పారు. క్రమంగా సినిమాలో పాటల సంఖ్య తగ్గుతోందని.. ఇప్పుడొస్తున్న సినిమాల్లో పాడుకునే పాటలే అరకొరా ఉంటున్నాయని ఆయన అన్నారు.
తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి దర్శకుడు విశ్వనాథే కారణమన్న సిరివెన్నెల.. తన తొలి సినిమాలోని *విరించినై* పాట తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఆ పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన విశ్వనాథ్.. దాని రికార్డింగ్ పూర్తయ్యాక సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారని.. ఆ మాట వినగానే కాళ్లూ చేతులూ వణికాయని సిరివెన్నెల చెప్పారు. చివరికి భయం భయంగానే ప్రెస్ మీట్కు వెళ్లి విలేకరుల ముందు పాట చదివి వినిపించానని... అందరూ హర్షధ్వానాలు పలకడంలో ముగ్ధుడిని అయిపోయానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa