అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనతను సాధించింది. దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోన్న ‘చంద్రయాన్ 2’ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3ఎం 1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్ఎల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
చంద్రయాన్-2 ఉపగ్రహం 52 రోజుల పాటు ప్రయాణించిన అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. ఇందులోని ప్రగ్యాన్ అనే రోవర్, విక్రమ్ అనే ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఈ ప్రయోగం కోసం ఇస్రో మొత్తం రూ.978 కోట్లు ఖర్చుచేసింది.
కాగా, చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రేవత్తలపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జయహో ఇస్రో అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్బాబు, ప్రభాస్, సమంత అక్కినేని, సాయిధరమ్ తేజ్, ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత ఎస్కేఎన్, హంసానందిని తదితరులు ఇస్రో టీంకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఇస్రో శాస్త్రవేత్తలు దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa