ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 16న విడుదల కానున్న '23'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 03:42 PM

హాస్యనటుడు ప్రియదర్శి హీరోగా పరిచయం అయిన సినిమా 'మల్లేశం'. ఈ సినిమా విడుదలై ఐదేళ్ళు అయ్యింది. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ రాచకొండ ఇప్పుడు '23' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మే 16న విడుదల కాబోతోంది. ఈ మధ్యలో ఆయన '8 ఎ.ఎం. మెట్రో' అనే హిందీ సినిమాను కూడా తీశారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల ఆధారంగా ఆ హిందీ సినిమా రూపుదిద్దుకుంది. ఇక '23' విషయానికి వస్తే... చిలకలూరి పేట బస్సు దహనం కేసు నేపథ్యంలో ఇది తెరకెక్కింది. అలానే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఈ సినిమాలో దర్శకుడు రాజ్ చూపించే ప్రయత్నం చేశారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి గీత రచయిత చంద్రబోస్, నటుడు ప్రియదర్శి అతిథులుగా హాజరయ్యారు.ఈ సినిమాకు పాటలు రాసే క్రమంలో దీనిని చూశానని, చాలా నిజాయితీతో రాజ్ దీనిని తెరకెక్కించారని, ఇందులో మూడు పాటలను రాశానని చంద్రబోస్ తెలిపారు. వజ్ర సంకల్పం ఉన్న దర్శకుడు రాజ్ తనలోని నిజాయితీని ఈ చిత్ర బృందంలోకి ప్రవహింప చేశారని ఆయన కితాబిచ్చారు. నటీనటులంతా చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారని, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతోందని అన్నారు. 'మల్లేశం' సినిమా ప్రియదర్శికి ఎలా నటుడిగా జన్మనిచ్చిందో ఈ సినిమా కూడా ఇందులోని నటీనటులకు కొత్త జన్మనివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa