ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో వారిదే కీ రోల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 07:42 PM

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఫైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయటం ద్వారానే.. గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌లోని ఫైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా.. అప్పటి ఎస్‌ఐబీ ఓఎస్డీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.


ఆ తర్వాత ఈ కేసులో అనుమానితులుగా ఉన్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్‌లకు నోటీసులు ఇవ్వటానికి సిట్ అధికారులు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లినట్లు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా.. కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లినట్లు తాజా విచారణలో తేలింది. సదరు విమానం ఓ బీఆర్ఎస్ నేతదిగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.


ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏంటి..?


2022 అక్టోబర్ 26న అప్పటి ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారేందుకు గాను ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ఖండించారు. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు బెయిల్‌పై బయటకు రాగా.. కేసు కొనసాగుతూనే ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa