ప్రస్తుతం రోజుకో రకం సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయకులే టార్గెట్గా కొందరు కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ సాయంతో ఉన్న చోటునుంచే కదలకుండా ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కేవేసీలు, ఓటీపీలు, లక్కీ డ్రాలు, లాటరీలు, గిఫ్ట్ల పేరుతో అత్యాశపరులకు వల వేసి అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా రాజకీయ నాయకులను కూడా వదలకుండా మోసాలు చేసేందుకు రెడీ అయ్యారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని పార్టీలు అభ్యర్థిని ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. కొందరు నేతలు టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ పెద్దల ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. నేతల వీక్నెస్ను ఆసరా చేసుకోని దెబ్బకొడుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని.. టికెట్ కావాలంటే డిపాజిట్ రూపంలో కొంత డబ్బులు చెల్లించాలంటూ మోసాలు చేస్తున్నారు.
తాజాగా.. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. పార్టీ బీ ఫామ్ కావాలంటే రూ. 76 వేలు చెల్లించాలంటూ ఆమెకు ఫోన్ చేశారు. అది విన్న కావ్య ఒకింత షాక్కు గురయ్యారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు ఆశావాహుల నుంచి పార్టీ రూ. 50 వేల చొప్పున డిపాజిట్ రుసం వసూలు చేసింది. అలాగే బీ ఫామ్ ఇచ్చే సమయంలోనూ డబ్బులు అడుగుతున్నారా ? అనే సందేహం ఆమెలో మెుదలైంది. ఇదే విషయాన్ని తన తండ్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెప్పింది కావ్య.
శ్రీహరి వెంటనే గాంధీ భవన్కు కాల్ చేశారు. బీ ఫామ్కు ఏమైనా డబ్బులు కట్టాలా ? అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో అది సైబర్ కాల్ అని కడియం కావ్య నిర్ధరణకు వచ్చారు. వెంటనే ఈ విషయంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa