ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 06:00 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ వాదనలతో న్యాయమూర్తి కావేరి భవేజా ఏకీభవించారు. ఈ మేరకు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పును వెలువరించారు.


మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో ఈడీ అధికారుుల కవితను అరెస్టు చేశారు. అనంతరం మార్చి 16న ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరచగా.. తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత మరో మూడురోజులు.. ఇలా మొత్తం 10 రోజులపాటు ఆమెకు ఈడీ కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ ముగియటంతో మార్చి 26న మరోసారి కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి కావేరి ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు. దీంతో ఆమెను తీహార్‌ జైలుకు తరలించింది.


అయితే తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని.. తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించగా.. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి (ఏప్రిల్ 8) వాయిదా వేశారు. సాధారణ బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఆమెకు బెయిల్ నిరాకరించారు. రేపటితో కవితకు జ్యూడీషియల్ రిమాండ్ ముగియనుండగా..ఆమెను మరోసారి కోర్టులో హాజరు పరచనున్నారు. న్యాయస్థానం కవిత రిమాండ్‌ను పొడగించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కవిత న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్‌ చేయాలని కోరతూ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణపై స్టేట్‌సకో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్‌పై సీబీఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాతే.. ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa