వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకుంటున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రైతులకు కీలక సూచనలు చేశారు. రైతులెవరూ కంగారుపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. జూన్ నెలాఖరు వరకూ కొనుగోలు చేస్తామని కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకొస్తే మద్దతు ధర కంటే తక్కువ రాకుండా చూసే బాధ్యత తమదని చెప్పారు. కనీస మద్దతు ధర కంటే ఎవరూ తక్కువకు కొనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. యాసంగిలో 75.40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఈసారి వరి సాగు తగ్గడంతో 60 లక్షల టన్నులకు పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలకుగాను ఈ నెల 12 కల్లా 6,919 కేంద్రాలు తెరిచామని, 1.87 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేశామని చౌహాన్ తెలిపారు.
ఇక ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల అడ్డుకట్టకు ఐరిస్ నిబంధనపెట్టామన్నారు చౌహాన్. దీనిపై రైతుల్లో ఏదైనా ఆందోళన ఉంటే.. పాత విధానమైన ఓటీపీ ద్వారా కొంటామన్నారు. వడ్లు తీసుకుని బియ్యం ఇవ్వని ఓ రైస్మిల్లు యజమాని దుబాయ్కి పారిపోయాడని.. ఎంతదూరం పోయినా వదలబోమని చెప్పారు. మిల్లర్లకు ధాన్యం ఇవ్వడంలో విధానపరమైన మార్పులపై దృష్టిపెట్టామన్న చౌహాన్.. బ్యాంకు గ్యారంటీ నిబంధనపై ఆలోచిస్తున్నామన్నారు. మిల్లర్కు వెళ్లే ప్రతి గన్నీ బస్తా కార్పొరేషన్కు తిరిగిరావాలని చౌహాన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa