ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్‌పై నాకు సానుభూతి ఉంది.. భావోద్వేగంతో మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 04:59 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంతూరైన కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తనకు సానుభూతి ఉందని తెలిపారు. ఆయన మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ప్రకటనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్‌లాగే మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.


మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకుమించి ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండమని మరోసారి చెప్పుకొచ్చారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17, 2025తో నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయని.. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు.


దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలిపారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందని.. అలాంటప్పుడు 400 సీట్లు ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా.. 10 ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని.. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు.


ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారన్నారని దుయ్యబట్టారు. ఇండియా కూటమి పేరుతో తాము ప్రజలను ఓట్లు అడుగుతోంటే... మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమన్నారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందన్నారు.


నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవని.. నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్‌పై చర్యలు లేవని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు కానీ.. ఒక వీడియో వైరల్ కేసులో తమపై చర్యలకు సిద్ధమైందన్నారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. బీజేపీ వాషింగ్ మెషిన్‌లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా అని ప్రశ్నించారు.


కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారని మోదీ ఆరోపిస్తున్నారని గుర్తు చేసి రేవంత్ రెడ్డి.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండమని మరోసారి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa