ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ కేంద్రంలో ఆయన పేరు ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:44 PM

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుంతుంది. ఉదయం 7 నుంచే ఓటర్లు బారులు తీరారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి. కిషన్ రెడ్డి కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తన స్నేహితులు, మిత్రులతో కలిసి ఓటేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ డే అంటే హాలీడే కాదని.. ఓటేసి బాధ్యతను పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. కాగా, ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పేరు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కామెంట్లపై టీ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారని కంప్లైంట్ చేసింది. ఇలా మాట్లాడటం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమేనని చెప్పారు. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని సీఈవోను కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa