పెళ్లైనా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోన్న ఓ మహిళ.. కట్టుకున్నవాడ్ని అత్యంత కిరాతకంగా చంపింది. గుండెపోటుతో చనిపోయాడని బంధువులు సహా అందర్నీ నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తిచేసింది. ఇక, తన నేరం బయటపడదని అనుకుంది. కానీ, ఆమె పాపం పండిపోవడంతో హత్య చేసిన నిందితుల్లో ఒకడు పోలీసులకు లొంగిపోయి అసలు విషయం బయటపెట్టాడు. అతడు గుండెపోటుతో చనిపోలేదని, దారుణంగా చంపేశామని చెప్పాడు. మూడున్నర నెలల కిందట హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జేపీ నగర్లో విజయకుమార్ (40) అనే వ్యక్తి తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే, పెళ్లికి ముందు రాజేశ్ అనే వ్యక్తిని శ్రీలక్ష్మి ప్రేమించింది. వివాహం తర్వాత కూడా ప్రియుడ్ని మరిచిపోలేని ఆమె.. అతడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. గుట్టుగా సాగుతోన్న ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావించింది. దీంతో విజయ్కుమార్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని.. ప్రియుడు రాజేశ్కు చెప్పడంతో అతడు సరేనన్నాడు.
ఇరువురూ కలిసి హత్యకు ప్లాన్ చేసి.. సనత్నగర్కు చెందిన రౌడీషీటర్ పటోళ్ల రాజేశ్వర్రెడ్డిని సంప్రదించారు. రాజేశ్వరరెడ్డి తనకు తెలిసిన మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్తో కలిసి విజయ్కుమార్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఫిబ్రవరి 1న పిల్లలను స్కూల్కు దింపడానికి విజయ్కుమార్ వెళ్లాడు. అప్పటికే పథకం ప్రకారం రాజేశ్, రాజేశ్వర్రెడ్డి, మైతాబ్ ఆ ఇంటి సమీపానికి వచ్చారు. వారిని శ్రీలక్ష్మి ఇంటిలోకి పిలిపించి టాయ్లెట్లో దాచిపెట్టింది.
పిల్లల్ని దింపి భర్త ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడిపెట్టింది. ఇంతలో బాత్రూమ్లో దాక్కున్న ముగ్గురP వచ్చిన డంబెళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. తనను చంపొందని విజయ్ వేడుకున్నా కనికరించలేదు. చంపొద్దని, కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ, విచక్షణారహితంగా కొట్టి విజయ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక శవాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లిపోయారు. అనంతరం శ్రీలక్ష్మి ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై బట్టలు మార్చేసింది. తర్వాత డ్రామాకు తెరతీసి.. తన భర్తకు గుండెపోటు వచ్చి బాత్రూమ్లో పడిపోయి చనిపోయాడని ప్రచారం చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్కు అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ క్రమంలో హత్య అనంతరం నిందితుడు రాజేశ్వర్రెడ్డి వికారాబాద్కు పారిపోయాడు. నేరం బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే, విజయ్ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం అతడ్ని బాధించింది. ఆ మాటలు పదేపదే గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో మే 16న మధురానగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్యోదంతాన్ని బయటపెట్టాడు. ఈ హత్యతో తనకు మానసిక ప్రశాంతత కరవైందని, పశ్చాత్తాపంతో లొంగిపోతున్నట్లు వెల్లడించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేపిన పోలీసులు.. రాజేశ్వర్రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్, మైతాబ్పై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa